జోస్ బట్లర్, ప్యాట్ కమ్మిన్స్, రషీద్ ఖాన్, కేన్ విలియంసన్... ఐపీఎల్ 2021 సీజన్కి స్టార్ అట్రాక్షన్ మిస్...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, యూఏఈ వేదికగా లీగ్ను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021 పార్ట్ 2కి స్టార్ అట్రాక్షన్ మిస్ అయ్యేలా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఖరారు చేశాడు...
ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ హాఫ్లో పాల్గొన్న జోస్ బట్లర్, న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఆడలేదు. ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లను, ఈ సిరీస్కి దూరంగా ఉంచాలని ఇంగ్లాండ్ బోర్డు తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం...
వచ్చే నెలలో పాకిస్తాన్తో ఆ తర్వాత శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్లు ఆడబోతోంది ఇంగ్లాండ్ జట్టు. ఆ తర్వాత టీమిండియాతో కలిసి ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది...
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచుల కోసం యూఏఈ చేరుకుంటుంది టీమిండియా...
అయితే ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం లీగ్లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ‘ఐపీఎల్ ఆడడం కోసం జాతీయ జట్టు సిరీస్లకు దూరంగా ఉండలేం. అయితే ఈసీబీ డైరెక్టర్ ఆస్లే గిల్స్ చెబితే లీగ్లో మిగిలిన మ్యాచుల్లో ఆడడానికి సిద్దంగా ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చాడు జోస్ బట్లర్.
అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు తమ ఆటగాళ్లను పంపడం కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో జోస్ బట్లర్ రావడం లేదని తేలిపోయింది...
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించిన జోస్ బట్లర్, 64 బంతుల్లో 124 పరుగులు చేసి ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. డేవిడ్ వార్నర్ లేని ఆ మ్యాచ్లో సన్రైజర్స్ 60 పరుగల భారీ తేడాతో ఓడింది..
కేకేఆర్ ఆల్రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు రావడం లేదని తేల్చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లను పంపేందుకు ఆ దేశ బోర్డు అంగీకరించినా... ప్యాట్ కమ్మిన్స్ గర్ల్ ఫ్రెండ్ డెలివరీ ఉండడంతో ఆ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. అతనితో పాటు ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్లో పాల్గొనడం అనుమానమే...
ఐపీఎల్ 2021 సీజన్ జరిగే సమయంలోనే ఆప్ఘాన్, బంగ్లాదేశ్లతో టీ20 ట్రై సిరీస్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆస్ట్రేలియా. ఈ టూర్ నుంచి స్మిత్ అండ్ కో రెస్ట్ తీసుకున్నా, ఆఫ్ఘాన్ పూర్తి జట్టుతో బరిలో దిగే అవకాశం ఉంది.