టీమిండియాకు గుడ్ న్యూస్.. పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు..
Jasprit Bumrah: భారత క్రికెట్ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్.. సుమారు పది నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే టీమ్ తో చేరనున్నాడని తెలుస్తున్నది.

టీమిండియా అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వెన్నుగాయం కారణంగా గతేడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్ జస్పీత్ బుమ్రా తిరిగి టీమ్ తో చేరనున్నాడట.
వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో టీమిండియా.. ఐర్లాండ్ తో మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 18, 20, 23 తేదీలలో భారత్ - ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరగాల్సి ఉంది.
గతేడాది ఆగస్టులో ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన టెస్టు తర్వాత బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆసియా కప్ కు కూడా దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం తిరగబెట్టడంతో దక్షిణాఫ్రికా సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు.
ఈ ఏడాది బుమ్రా ఫిబ్రవరిలో న్యూజిలాండ్ కు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక టోర్నీలకు కూడా మిస్ అయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఫిట్నెస్ సాధించేపనిలో ఉన్న బుమ్రా.. రాబోయే ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లో చాలా కీలకం.
అక్టోబర్ లో జరుగబోయే వరల్డ్ కప్ లో అతడు ఆడాలంటే ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. ఇందులో భాగంగానే అతడు ఆగస్టులో ఐర్లాండ్ సిరీస్ ఆడాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది.
Image credit: Getty
బుమ్రా రాకపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకుని ఎన్సీఏలో ఫిట్నెస్ ను మెరుగుపరుచుకునే క్రమంలో ఉన్నాడు. అతడు త్వరలోనే ఐర్లాండ్ సిరీస్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. టీమిండియాకు ఇది బిగ్ బూస్ట్. అన్నీ కుదిరితే అతడు ఆసియా కప్ లో ఆడతాడు...’అని తెలిపాడు.