IPL 2022: అతడు ధోనికి తలనొప్పిగా మారాడు.. సీఎస్కే సారథిపై భజ్జీ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022: ఐపీఎల్-2022 లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగి వరుసగా మూడు పరాజయాలతో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజాపై టీమిండియా మాజీ క్రికెటర్, గతంలో చెన్నై తరఫున ఆడిన టర్బోనేటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తాకుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన ఆ జట్టు.. ఈ సీజన్ లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నది.
ఈ సారి కెప్టెన్ గా వైదొలిగి రవీంద్ర జడేజా కు ఆ బాధ్యతలు అప్పగించిన ధోనికి అతడు తలనొప్పిగా మారాడని ఆ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అంటున్నాడు. జడ్డూ.. ధోని పై అతిగా ఆధారపడుతున్నాడని చెప్పుకొచ్చాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో భజ్జీ మాట్లాడుతూ... ‘నాకు తెలిసి చెన్నైకి ఇంకా ఎంఎస్ ధోనినే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని అనిపిస్తున్నది. మ్యాచులు జరుగుతున్నప్పుడు రవీంద్ర జడేజా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు.
ఒక సారథి రింగ్ లోపల ఉండకుంటే అతడు మ్యాచులో చాలా పరిస్థితులను నియంత్రించలేడు. దీంతో ఫీల్డ్ సెట్ చేయడంతో పాటు మిగతా విషయాల్లో జడేజా.. ధోనిపైనే ఆధారపడుతున్నాడు.
గత కొన్ని మ్యాచుల్లో ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జడేజా రాను రాను ధోనికి తలనొప్పిగా తయారయ్యాడు. తన భుజాలపై భారాన్ని ధోనిపై మోపుతున్నాడు.
జట్టు సరిగా పర్ఫార్మ్ చేయనప్పుడు ధోనితో మాట్లాడి పరిస్థితులను కంట్రోల్ చేయడం వేరు.. పూర్తిగా అతడిమీదే వదిలేయడం వేరు.. జడేజా ఇప్పటికైనా తన వ్యూహాలను మార్చుకోకుంటే జట్టుకు మరిన్ని పరాజయాలు ఎదురవక తప్పదు...’ అని భజ్జీ చెప్పాడు.
డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన చెన్నై.. సీజన్ ప్రారంభంలో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పై ఓడింది. ఈనెల 9న ఆ జట్టు సన్ రైజర్స్ తో పోటీ పడాల్సి ఉంది.