ఆ తుంటరిపనికి బతికిపోయిన ఇషాన్ కిషన్.. మరోసారి చేస్తే షాకులు తప్పవని హెచ్చరించిన ఐసీసీ
Ishan Kishan: ఇండియా - న్యూజిలాండ్ నడుమ ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. వికెట్ల వెనుక చేసిన తుంటరిపనిపై ఐసీసీ స్పందించింది.
హైదరాబాద్ వేదికగా ఈనెల 18న ముగిసిన ఇండియా - న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్.. కివీస్ సారథి టామ్ లాథమ్ బ్యాటింగ్ చేస్తుండగా ఓ తుంటరి పని చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో నాలుగో బంతిని లాథమ్ డిఫెన్స్ ఆడబోయాడు. లాథమ్ క్రీజులోపలికి వచ్చాడు. కానీ అది కాస్తా మిస్ అయింది.
రెండు క్షణాల వ్యవధిలో వికెట్ల మీద ఉన్న బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో లాథమ్ హిట్ వికెట్ అయ్యాడేమో అని భావించి టీమిండియా ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేశారు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా కూడా ఇషాన్ చేసిన తుంటరి పనిని పసిగట్టలేదు.
వాస్తవానికి లాథమ్ క్రీజులోపలికి వచ్చి ఆడినా వికెట్లకు, అతడి కాలుకు కావాల్సినంత దూరం ఉంది. అయితే బంతిని అందుకున్న వెంటనే ఇషాన్.. తన గ్లవ్స్ తో ఎవరూ చూడకముందు బెయిల్స్ ను పడగొట్టాడు. తర్వాత తీరిగ్గా అంపైర్ కు అప్పీల్ చేశాడు. టీవీ రిప్లైలో ఇది స్పష్టం కనిపించింది.
ఇషాన్ చేసిన ఈ పని తర్వాత టీమిండియా ఆటగాళ్లకు నవ్వు తెప్పించింది. కానీ ఐసీసీ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఇషాన్ ఇది ఉద్దేశపూర్వకంగానే చేశాడని భావించిన ఐసీసీ.. ఇషాన్ పై చర్యలకు దిగింది. ఈ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరిస్తున్న జవగళ్ శ్రీనాథ్.. ఇషాన్ పై చర్యలకు దిగాడు.
ఉద్దేశపూర్వకంగా ఎవరైనా క్రికెటర్ ఇలా చేస్తే ఐసీసీ కఠిన శిక్షలు విధిస్తుంది. ఆ తప్పు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.15 ప్రకారం.. ఇది లెవల్ 3 నేరం కిందకు వస్తుంది. కొన్నికొన్నిసార్లు ఈ నేరంలో ఆటగాడి మీద నాలుగు నుంచి 12 వన్డేల వరకూ నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. ఇషాన్ పై నాలుగు వన్డేల నిషేధం తప్పదని కివీస్ మీడియాలో కథనాలు వచ్చాయి.
కానీ శ్రీనాథ్ మాత్రం ఇషాన్ కు అంత కఠిన శిక్షలు విధించలేదు. ఇషాన్ ను మందలించి మరోసారి ఇలాంటివి చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించాడు. అయితే శ్రీనాథ్ చర్యలు తీసుకోకపోవడానిక మరో కారణం కూడా ఉంది. ఈ ఘటనపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్ లు ఐసీసీకి ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడంతో కిషన్ బతికిపోయాడు.