- Home
- Sports
- Cricket
- ఒక్కో మ్యాచ్కి రూ.49 కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కులకు బిడ్ ప్రైజ్ ఎంతో తెలుస్తే...
ఒక్కో మ్యాచ్కి రూ.49 కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కులకు బిడ్ ప్రైజ్ ఎంతో తెలుస్తే...
ఐపీఎల్ 2022 సీజన్లో 10 ఫ్రాంఛైజీలతో 74 మ్యాచుల సుదీర్ఘ సీజన్ని నిర్వహించి, సక్సెస్ సాధించింది బీసీసీఐ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు లీగ్ స్టేజీకే పరిమితమైనప్పటికీ, ప్లేఆఫ్స్ మ్యాచులకు మంచి వ్యూయర్షిప్ వచ్చింది... ఈ సక్సెస్తో ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు..

జూన్ 12న ఉదయం 11 గంటలకు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ-వేలం ప్రారంభం కానుంది. ఇందులో వయాకమ్ 18, అమేజాన్ ప్రైమ్తో సహా దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొనబోతున్నాయి...
ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయానికి బేస్ ప్రైజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఐపీఎల్లో టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్కి రూ.49 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ, డిజిటల్ హక్కుల కోసం మరో రూ.33 కోట్లు బేస్ ప్రైజ్గా నిర్ణయించింది..
అంటే ఒకవేళ గత ఐదేళ్లుగా ఐపీఎల్ని ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈసారి కూడా ప్రసారహక్కులను సొంతం చేసుకుంటే... స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రసారం చేయడానికి ఒక్కో మ్యాచ్కి తక్కువలో తక్కువ రూ.50 కోట్లు... బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. హాట్ స్టార్లో ప్రసారం చేసేందుకు మరో రూ.33 కోట్లు చెల్లించాలి... ఇది బేస్ ప్రైజ్ మాత్రమే. ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే, వారికి ప్రసార హక్కులు దక్కుతాయి...
Image credit: PTI
అలాగే మధ్యహ్నం జరిగే నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచులకు ఒక్కో మ్యాచ్కి రూ.16 కోట్లు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ, ఇండియాలో కాకుండా బయటి దేశాల్లో మ్యాచుల ప్రసారానికి అదనంగా ప్రతీ మ్యాచ్కీ మరో రూ.3 కోట్లు చెల్లించాల్సిందిగా బేస్ ప్రైజ్ నిర్ణయించింది..
ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం వేయనుంది బీసీసీఐ. అంటే మొత్తంగా 370 మ్యాచుల ప్రసారం హక్కులకు కలిపి బేస్ ప్రైజ్ లెక్కలు వేసుకున్నా రూ.32,890 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరబోతున్నాయి...
బేస్ ప్రైజ్ నుంచి బిడ్ పైకి వెళ్లేకొద్దీ బీసీసీఐ ఖాతాలో చేరే సొమ్ము ఎంతకి పెరుగుతుంది, ఎన్ని వేల కోట్లకు చేరుతుందనేది తేలిపోతుంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ ఖాతాలో రూ.40 నుంచి రూ.45 వేల కోట్ల దాకా ఆదాయం సమకూరుతుందని అంచనా...
వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు... ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్లో పాల్గొనబోతున్నాయని సమాచారం...