IPL 2022: ఐపీఎల్ వేలం మరింత ఆలస్యం.. కారణం అదే.. ఈసారి యాక్షన్ ఎక్కడో తెలుసా..?
IPL Auction 2022: ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఐపీఎల్ లో వేలం ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందా...? అని క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో వేచి చూస్తున్నారు.

భారత్ లో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తున్నది. ముందుగా ఇది 2022 జనవరి రెండు లేదా మూడో వారంలో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రయత్నాలు చేసింది.
కానీ తాజాగా.. ఈ వేలం ప్రక్రియను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు సమాచారం. ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీలకు ఇప్పటికే ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశానికి సంబంధించిన డెడ్ లైన్ ను కూడా బీసీసీఐ పొడిగించింది.
అయితే ప్రధానంగా.. ఐపీఎల్ లో కొత్త జట్టు దక్కించుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన వివాదం ఇంకా సమిసిపోలేదు. ఆ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్.. బెట్టింగ్ వివాదంలో చిక్కుకుంది.
సీవీసీ క్యాపిటల్స్ కు బెట్టింగ్ సంస్థలతో సంబంధాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. తుది తీర్పును వెల్లడించాల్సి ఉంది.అది డిసెంబర్ ఆఖరు వారంలో వెలువడుతుందని అనుకున్నా.. మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
సీవీసీపై విచారణ చేపట్టిన బీసీసీఐ... ఆ తీర్పు వెల్లడించి సమస్యలన్నీ కొలిక్కి వచ్చిన తర్వాతే ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాలని చూస్తున్నది.
అయితే ఈసారి వేలాన్ని ముంబయి లో కాకుండా దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ రెండు నగరాల్లో ఎక్కడో ఒకచోట వేలం ప్రక్రియ జరుగనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
2022 ఏప్రిల్ లో భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఆయా జట్లన్నీ తాము నిలుపుకునే నలుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. ఇక మిగిలుంది వేలం ప్రక్రియనే.