చివరిసారిగా ఐపీఎల్లో ధోనీ వర్సెస్ విరాట్ కోహ్లీ... ఆ రికార్డులన్నీ పేలిపోవడం ఖాయమంటున్న ఫ్యాన్స్...
ఐపీఎల్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ 2023 సీజన్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్తో తలబడుతోంది. ఈ మ్యాచ్లో చివరిసారిగా విరాట్ కోహ్లీ, ఎం.ఎస్ ధోనీ బరిలో దిగబోతున్నారు...
ఐపీఎల్ 2023 సీజన్తో మహేంద్ర సింగ్ ధోనీ, పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇప్పటికే మాహీ ‘ఫేర్వెల్ సీజన్’గా ఐపీఎల్ 2023ని ప్రచారం చేస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్. సీఎస్కే ఆడే మ్యాచుల్లో స్టేడియమంతా ధోనీ ఫ్యాన్స్తో నిండిపోయి పసుపు వర్ణం అయిపోతోంది...
ఇప్పటికే సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. పూర్తి స్టేడియంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఆటను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. ధోనీకి చిన్నస్వామి స్టేడియంలో అదిరిపోయే రికార్డు ఉంది..
Kohli_Dhoni
ఇప్పటి దాకా బెంగళూరులో ఆడిన ఐపీఎల్ మ్యాచుల్లో 92.60 సగటుతో 463 పరుగులు చేశాడు ధోనీ. ఇందులో 5 హాఫ సెంచరీలు, 35 ఫోర్లు, 32 సిక్సర్లు ఉన్నాయి. చెపాక్ స్టేడియం తర్వాత ధోనీకి 180.86 స్ట్రైయిక్ రేటుతో అద్భుతమైన రికార్డు ఉంది చిన్నస్వామి స్టేడియంలోనే...
dhoni-kohli ipl
ఐపీఎల్ 2023 సీజన్లో రికార్డు బ్రేకింగ్ వ్యూయర్షిప్ వచ్చిన మ్యాచులన్నీ విరాట్ కోహ్లీ, ఎం.ఎస్ ధోనీ ఆడిన మ్యాచులే. ఆర్సీబీ మొదటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.6 కోట్లను తాకింది జియో సినిమా రియల్ టైం వ్యూస్..
ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ధోనీ క్రీజులోకి వచ్చి ఓ 6, 4 బాదగానే 1.7 కోట్లను తాకిన రియల్ టైం వ్యూస్, ఆర్సీబీ తర్వాతి మ్యాచ్లో 1.8 కోట్ల మార్కును టచ్ చేశాయి. ఈ రికార్డును మళ్లీ మహేంద్ర సింగ్ ధోనీయే తిరగరాశాడు...
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉండడంతో 1.9 కోట్లు, 2 కోట్లను దాటిన జియో సినిమా రియల్ టైం వ్యూస్... పీక్ స్టేజీలో 2.2 కోట్ల మార్కుని తాకింది. ఈ రికార్డును నేటి మ్యాచ్ తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు ఐపీఎల్ ట్రేడ్ పండితులు...
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రెండు జట్లు, హ్యూజ్ క్రేజ్ ఉన్న ఇద్దరు క్రికెటర్లు చివరిసారిగా తలబడబోతుండడంతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్లో చూసే అదృష్టం మళ్లీ ఎప్పుడు దక్కుతుందోనని బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఆర్సీబీపై సీఎస్కే ఘనమైన రికార్డు ఉంది. అయితే 2023 సీజన్లో ఇప్పటిదాకా చెరో నాలుగేసి మ్యాచులు ఆడిన ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్, రెండేసి విజయాలు సాధించాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా ధోనీ టీమ్ ఆరో స్థానంలో ఉంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు, టాప్ 4లోకి ఎగబాకుతుంది.