మీరు మారారండి.. మీరు మారారు సార్..! షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న కోహ్లీ-దాదా
Kohli vs Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ను అభిమానులు గత మ్యాచ్ మాదిరిగానే కోహ్లీ - గంగూలీ పోరు గురించి చూశారు. కానీ ఈ మ్యాచ్ ముగిశాక ఎవరూ ఊహించంది జరిగింది.

ఐపీఎల్-16లో వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్న ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కాస్త తగ్గాడు. తగ్గితే తప్పేమిలేదన్న సూత్రాన్ని ఒంటబట్టించుకున్నాడో లేక ప్రతీసారి ఎందుకు గొడవలని అనుకున్నాడో గానీ ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు కనబడింది.
ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ ను అభిమానులు గత మ్యాచ్ మాదిరిగానే కోహ్లీ - గంగూలీ పోరు గురించి చూశారు. దీనికి కారణాలు అనేకం. కోహ్లీ - దాదాల మధ్య రెండేండ్లుగా వస్తున్న విభేదాలు.. ఇదే ఐపీఎల్ సీజన్ లో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో దాదాను కోహ్లీ ఉరిమిచూడటం.. మ్యాచ్ ముగిశాక గంగూలీని పూర్తిగా ఇగ్నోర్ చేయడం వంటివి అతడి ఇమేజ్ కు నష్టం చేకూర్చాయి.
ఇక లక్నో - బెంగళూరు మ్యాచ్ లో అయితే కోహ్లీ .. నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, గౌతం గంభీర్ వంటి వాళ్లతో గిచ్చి మరీ కయ్యం పెట్టుకున్నాడు. ఇది కోహ్లీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసింది. అంత పెద్ద ప్లేయర్ అయి ఉండి ఎదుటి ఆటగాళ్లపై ఇలా వ్యవహరించడం సరికాదన్న విమర్శలు వినిపించాయి. ఇదే క్రమంలో ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ ఇంకెంత రచ్చ చేస్తాడోనని అతడి అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఒకటే ఆందోళన.
కానీ ఎటువంటి నాటకీయతకు చోటివ్వకుండా కోహ్లీ.. ఢిల్లీ మ్యాచ్ ముగిశాక దాదా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మ్యాచ్ ఓడిన బాధలో ఉండి ఏదో ముభావంగా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కాకుండా దాదాను చూడగానే కోహ్లీ.. నవ్వుతూ చేతిలో చేయి వేశాడు. దాదా కూడా ఆప్యాయంగా కోహ్లీ భుజం తట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గంగూలీ - కోహ్లీ షేక్ హ్యాండ్ ఫోటో, వీడియో నెట్టింట వైరల్ గా మారిన తర్వాత ఇరువురు ఆటగాళ్ల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీలో ఈ మార్పు ఊహించలేదని.. గంభీర్ తో గొడవ తర్వాత అతడిలో చాలా మార్పు వచ్చినట్టే కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందైతే ‘నువ్వు ఎంత ఆడినా ఆ ఆర్సీబీ కప్ కొట్టదన్నా. ఢిల్లీకి మారు. కోట్లా (ఫిరోజ్ షా కోట్లా) ను ఏలేద్దాం..’అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఢిల్లీ - బెంగళూరు మధ్య శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ.. 16.4 ఓవర్లలోనే ఊదేసింది. ఢిల్లీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. 45 బంతుల్లో 8 బౌండరీలు, ఆరు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు.