రిస్క్ వద్దు మావ! నువ్వు ఇటు వచ్చేయ్, నేను మ్యాచ్ ఫినిష్ చేస్తా... ఆండ్రే రస్సెల్తో రింకూ సింగ్...
ఐపీఎల్ 2023 సీజన్లో అదరగొడుతున్న యంగ్ స్టర్ రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్, ఆ తర్వాత మ్యాచుల్లో కూడా అదరగొట్టాడు...
కేకేఆర్ ఓడిపోయిన మ్యాచుల్లో కూడా రింకూ సింగ్ బ్యాటు నుంచి మంచి ఇన్నింగ్స్లు వచ్చాయి. ఆర్సీబీతో మ్యాచ్లో 33 బంతుల్లో 46 పరుగులు, సన్రైజర్స్ హైదరాబాద్తో మొదటి మ్యాచ్లో 31 బంతుల్లో 58 పరుగులు చేసిన రింకూ సింగ్, ఇప్పటిదాకా 2023 సీజన్లో రెండు హాఫ్ సెంచరీలు, మరో 3 సార్లు 45+ స్కోర్లు బాదాడు...
Rinku Singh
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి ఫోర్ బాది కేకేఆర్ని అత్యవసర విజయాన్ని అందించాడు రింకూ సింగ్. అయితే ఆఖరి బంతికి ముందు ఆండ్రే రస్సెల్ రనౌట్ అయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన రస్సెల్ రనౌట్కి రింకూయే కారణమట..
‘రింకూని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఆఖరి ఓవర్ ఐదో బంతికి ముందు నా దగ్గరికి వచ్చి, బ్యాటుకి తగలకపోతే సింగిల్ పరుగెడదామని అన్నాడు. నేను సరేనని చెప్పాను.
అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఫినిష్ చేయలేకపోతే అతను ఫినిష్ చేస్తాడని నమ్మాను. ఎందుకంటే అతను ఓ గొప్ప ఫినిషర్’ అంటూ కామెంట్ చేశాడు ఆండ్రే రస్సెల్...
Image credit: PTI
‘ఓ అన్క్యాప్డ్ భారత ప్లేయర్ రింకూ సింగ్, వరల్డ్ బెస్ట్ ఫినిషర్లలో ఒకడైన ఆండ్రే రస్సెల్ని నాన్ స్ట్రైయికర్ ఎండ్కి రమ్మని కోరాలంటే దానికి ఎంత నమ్మకం కావాలి. రింకూ సింగ్కి తన ఆటపై ఉన్న నమ్మకం అది. ఇది ఐపీఎల్లో మాత్రమే సాధ్యం...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..
Rinku Singh
కేకేఆర్ విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 26 పరుగులు కావాల్సి వచ్చాయి. సామ్ కుర్రాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆండ్రే రస్సెల్ 3 సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టాడు. దీంతో కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులే కావాల్సి వచ్చాయి...
Image credit: PTI
అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్, చివరి ఓవర్లో కేకేఆర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ మొదటి 5 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతిని రస్సెల్ పూర్తిగా మిస్ చేశాడు..
Image credit: PTI
ఆ తర్వాత వరుసగా రెండు సింగిల్స్ రాగా, నాలుగో బంతికి 2 పరుగులు వచ్చాయి. చివరి 2 బంతుల్లో కేకేఆర్ విజయానికి 2 పరుగులే కావాలి. అయితే రస్సెల్ చివరి 2 బంతులను మిస్ చేస్తే, మ్యాచ్ బొక్కపడుతుందని భావించిన రస్సెల్, ఐదో బంతికి సింగిల్ తీయమని సూచించి, అతను రనౌట్ కావడానికి కారణమయ్యాడు..
ఆఖరి బంతికి ఫోర్ బాది మ్యాచ్ని ముగించేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆండ్రే రస్సెల్ రనౌట్ అవ్వడానికి కారణమైనందుకు రింకూ సింగ్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎందుకంటే కేకేఆర్ ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునేది.