IPL 2022: రాజస్థాన్ తోనే శాంసన్..! కేరళ ఆటగాడితో భారీ డీల్..? ఢిల్లీ రిటైన్ చేసుకునేది వీళ్లనే..
Sanju Samson: రిటైన్ ప్లేయర్ల జాబితాను అందించడానికి నవంబర్ 30 తారీఖు చివరితేది కావడంతో మరో రెండ్రోజుల్లో ఏ ఏ జట్లు ఎవరెవరిని రిటైన్ చేసుకోబొతున్నాయి..? ఎవర్ని వేలంలో వదిలేస్తాయి..? ఎవరిని పూర్తిగా వదులుకుంటాయనే విషయాలమీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏ క్రికెటర్లు ఏ జట్టుకు ఆడతారో అనే ఆసక్తి అభిమానుల్లో నానాటికీ పెరుగుతున్నది. ఇక వచ్చే నెలలో జరుగబోయే ఐపీఎల్ వేలానికి ముందు తాము రిటైన్ చేసుకోబోయే నలుగురు ఆటగాళ్ల వివరాలను ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆయా జట్లకు ఆదేశాలు అందాయి.
అయితే ఐపీఎల్ లో మెరుగ్గా రాణించే కేరళ ఆటగాడు సంజూ శాంసన్.. చాలా కాలంగా తాను ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ను వీడనున్నాడని గతంలో వార్తలు వచ్చినా అతడు మాత్రం ఆ జట్టుతోనే ఉండనున్నాడు. శాంసన్ రాజస్థాన్ ను వీడనున్నాడని, ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేయడమే గాక చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలను ఫాలో చేయడంతో శాంసన్ చెన్నై తో చేరుతాడా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ మేరకు సంజూ శాంసన్ కు భారీగా ముట్టజెప్పడానికి కూడా వెనుకాడలేదు. ఈ యువ ఆటగాడికి రూ. 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటున్నది. అయితే ఇంత భారీ మొత్తం ఈ ఒక్క సీజన్ కేనా..? లేక వచ్చే మూడేండ్లకా..? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
పలు నివేదికల ప్రకారం.. తాము నిలుపుకోబోయే ప్లేయర్ల జాబితా విషయంలో రాజస్థాన్ రాయల్స్ తలలు పట్టుకుంటున్నది. సంజూ శాంసన్ ను నిలుపుకున్నా తర్వాత ముగ్గురు ఎవరా..? అనేదానిమీద మాత్రం మల్లగుల్లాలు పడుతున్నది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. అయితే శాంసన్ తో పాటు.. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను కూడా ఆ జట్టు నిలుపుకోవచ్చు.
వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ లలో ఎవరిని తీసుకోవాలనేదానిమీద ఆ జట్టు సందిగ్దంలో ఉంది. దీనిపై మరో నాలుగు రోజుల్లో స్పష్టత రానున్నది.
వీళ్లతో పాటు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విషయంలో కూడా ఆ జట్టు ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయితే అతడిని వదులుకున్నా.. బిడ్ లో దక్కించుకోవాలని చూస్తున్నది.
ఇదిలాఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిటైన్ చేసుకోబోయే ప్లేయర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జట్టు సారథి రిషభ్ పంత్ తో పాటు ఓపెనర్ పృథ్వీ షా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, దక్షిణాఫ్రికా పేసర ఆన్రిచ్ నార్త్జ్ లను రిటైన్ చేసుకోబోతున్నట్టు సమాచారం.
నాలుగేండ్లుగా ఆ జట్టు తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ను ఢిల్లీ వదులుకోనుంది. ఇక అతడితో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ ను కూడా రిటైన్ ప్లేయర్ల జాబితాలో చేర్చలేదు. ఇదే విషయమై మూడు రోజుల క్రితం స్పిన్నర్ అశ్విన్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను, అయ్యర్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోవడం లేదని చెప్పిన విషయం విదితమే.