అతన్ని వదిలేది లేదు, ఎంత ఖర్చుపెట్టైనా సరే... సురేష్ రైనాపై రాబిన్ ఊతప్ప కామెంట్...
ఐపీఎల్ 2019 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా... అయితే ఐపీఎల్ 2022 సీజన్కి సీఎస్కే విడుదల చేసిన రిటెన్షన్ లిస్టులో సురేష్ రైనా పేరు కనిపించలేదు...
గతంలో మూడుసార్లు మెగా వేలం నిర్వహించినప్పుడు సురేష్ రైనాని సెకండ్ రిటెన్షన్గా అట్టిపెట్టుకుంటూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి మాత్రం ‘చిన్నతలా’ని రిటెన్షన్ లిస్టులో చేర్చలేదు...
2020 సీజన్ ఆరంభానికి ముందు తన మామను దోపిడీ దొంగలు హత్య చేయడంతో టోర్నీకి దూరమయ్యాడు సురేష్ రైనా. అయితే 2021 సీజన్లో రైనాని రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్...
దాదాపు రెండేళ్ల తర్వాత లీగ్లో బరిలో దిగిన సురేష్ రైనా, ఐపీఎల్ 2021 సీజన్లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 11 మ్యాచుల్లో 17.78 సగటుతో 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, 16 మ్యాచుల్లో 14 సగటుతో కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు. అయినా ఎమ్మెస్ ధోనీని రిటైన్ చేసుకున్న సీఎస్కే, రైనాని మాత్రం వేలానికి విడుదల చేసింది...
‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి సురేష్ రైనా చాలా పెద్ద ఆస్తి లాంటోడు. ఎన్నో ఏళ్లుగా మాహీతో పాటు రైనా కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు...
చెన్నై సూపర్ కింగ్స్కి నాకౌట్ స్టేజుల్లో సురైష్ రైనా కీ ప్లేయర్గా ఉన్నాడు. గత 10-12 ఏళ్లుగా రైనా, సీఎస్కేకి చేసిన సేవలు వెలకట్టలేనివి...
కాబట్టి ఎలా చూసినా, చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రైనాని వదులుకోవడానికి సిద్దంగా ఉండదు. వేలంలో ముందుగా కొనుగోలు చేసే ప్లేయర్ అతనే...
నాకు తెలిసి ఫాఫ్ డుప్లిసిస్ కంటే మొయిన్ ఆలీని అట్టిపెట్టుకోవడానికి కారణం అతను ఆల్రౌండర్ కావడమే... డుప్లిసిస్ కోసం కూడా సీఎస్కే తప్పక ప్రయత్నిస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ జట్టు ప్లేయర్ రాబిన్ ఊతప్ప...
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ కూడా పాత టీమ్లోని ప్రతీ ప్లేయర్ను వేలం ద్వారా తిరిగి జట్టులోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కామెంట్ చేశాడు...
సీఎస్కేతో పాటు ముంబై ఇండియన్స్ టీమ్ కూడా పాత జట్టులోని ప్లేయర్లను తిరిగి వేలంలో కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపింది...