- Home
- Sports
- Cricket
- IPL: సీవీసీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..? మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
IPL: సీవీసీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..? మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
IPL 2022: ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చి అహ్మాదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పనుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ యూరోపియన్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ సీవీసీ క్యాపిటల్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) క్రిస్మస్ కానుక ఇవ్వనుంది. ఇటీవలే ముగిసిన కొత్త జట్ల వేలం ప్రక్రియలో అహ్మాదాబాద్ ఫ్రాంచైజీని గెలుచుకున్నా.. ఐపీఎల్ లో ఆ జట్టు ఆడుతుందా..? లేదా..? అనేది సందిగ్దంగా మారింది.
పలు బెట్టింగ్ సంస్థలతో సీవీసీకి సంబంధాలున్నాయనేది దానిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. దీనిమీద బీసీసీఐ.. ముగ్గురితో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ కొద్దిరోజులుగా విచారణ చేపట్టింది.
సిసల్, టిప్కో అనే బెట్టింగ్ సంస్థలతో సీవీసీకి సంబంధాలున్నాయి. ఇవి స్పోర్ట్స్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ సంస్థలు. దీనిమీదే సీవీసీ ప్రధానంగా ఆరోపణలు ఎదర్కుంటున్నది.
అయితే సీవీసీకి వచ్చే నిధులను రెండు రకాలుగా పేర్కొంటున్నది. అందులో ఒకటి యూరోపియన్ ఫండ్ కాగా.. రెండోది ఆసియా ఫండ్. యూరోపియన్ కంట్రీస్ లో ఫుట్బాల్, రగ్బీ, రేసింగ్ స్పోర్ట్స్ లో కూడా సీవీసీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.
అయితే సిసల్, టిప్కో సంస్థలు యూరోపియన్ ఫండింగ్ తో నడుస్తున్నాయని, వాటికి ఆసియా ఫండ్ తో సంబంధం లేదని బీసీసీఐ విచారణలో సీవీసీ పేర్కొంది. రెండింటి లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించిన బీసీసీఐ కమిటీ.. ఆసియా ఫండ్స్ లో అవకతవకలేమీ లేవని తేల్చి చెప్పింది.
దీంతో ఈ వారంలోనే సీవీసీ కి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయమై బీసీసీఐ కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘అవును.. ముగ్గురు మెంబర్ల లీగల్ కమిటీ.. సీవీసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
రెండు, మూడు రోజుల్లో ఆ జట్టుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా అందిస్తాం. దాంతో ఆ జట్టు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియకు ఏ ఆటంకం లేకుండా పాల్గొనవచ్చు.. మిగతా ఫార్మాలిటీలను త్వరలోనే పూర్తి చేస్తాం..’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ మెగా వేలాన్ని ఫిబ్రవరి 7,8 వ తేదీలలో బెంగళూరులో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ వేలానికి ముందే ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన లక్నో, అహ్మదాబాద్ లు.. పాత ఫ్రాంచైజీలలోని ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ కూడా మరో వారం రోజుల్లో మొదలుకానుంది.