కేన్ మామకి కొడుకు పుట్టాడు... హైదరాబాద్ బామ్మర్ధి అంటూ సోషల్ మీడియాలో జోకులు...
ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లాడు కేన్ విలియంసన్. పంజాబ్ కింగ్స్తో ఆఖరి మ్యాచ్కి ముందే కేన్ విలియంసన్, న్యూజిలాండ్కి వెళ్లిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే తాను అలా ఇంటికి వెళ్లడానికి కారణం ఉంది...

డేవిడ్ వార్నర్ స్థానంలో గత ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కేన్ విలియంసన్... అప్పటి నుంచి సరిగ్గా పరుగులు సాధించలేకపోతున్నాడు. కెప్టెన్సీ భారమో లేక ఫామ్లో లేకనో కానీ జట్టును బ్యాటింగ్లో తన వంతు సాయం చేయలేకపోతున్నాడు...
ఐపీఎల్ 202 సీజన్లో 13 మ్యాచుల్లో 19.64 సగటుతో 216 పరుగులు చేశాడు కేన్ విలియంసన్. స్ట్రైయిక్ రేటు కేవలం 93.51 మాత్రమే.. ఓపెనర్గా వచ్చి అతి తక్కువ స్ట్రైయిక్ రేటు కలిగిన బ్యాటర్గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు కేన్ విలియంసన్...
ఆయన భార్య సారా రహీం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్య డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్లైట్ ఎక్కి స్వదేశానికి వెళ్లిపోయాడు కేన్ విలియంసన్...
డిసెంబర్ 2020న కేన్ విలియంసన్, సారా రహీం దంపతులకు ఓ అమ్మాయి జన్మించింది. సరిగ్గా కేన్ మామ స్నేహితుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ కింద ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సమయంలోనే, వెస్టిండీస్ సిరీస్ నుంచి తప్పుకుని ఇంటికి వెళ్లాడు కేన్ విలియంసన్...
కూతురికి మ్యాగ్గీ అని పేరు పెట్టిన కేన్ విలియంసన్, తన భార్య ఒడిలో ఉన్న తమ్ముడితో ఆడుకుంటున్న ఆ చిన్నారి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్, కేన్ మామకి ‘కంగ్రాట్స్...’ తెలిపింది...
కేన్ విలియంసన్ని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా ‘కేన్ మామ’ అని పిలుచుకుంటారు. దీంతో ఆయన కొడుకుని ‘హైదరాబాద్ బామ్మర్ది వచ్చాడంటూ’ అంటూ కొన్ని జోకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
కేన్ విలియంసన్ స్వదేశానికి వెళ్లిపోవడంతో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్కి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే అప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది...
ఐపీఎల్ 2021 సీజన్లో 8 జట్లు పాల్గొన్నప్పుడు 8వ స్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ 2022 లో 10 జట్లు ఆడుతున్న సీజన్లోనూ అదే పొజిషన్లో ముగించడం విశేషం...
ఐపీఎల్ 2022 సీజన్లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్... ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ, ఆఖరి రెండు మ్యాచుల్లో ఓ దాంట్లో గెలిచి ఓ దాంట్లో ఓడింది...