ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచులు భారత్లో పెట్టలేం... సీజన్ పూర్తిచేస్తామో లేదో... సౌరవ్ గంగూలీ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్ సజావుగా సాగుతున్న సమయంలో కరోనా వైరస్ ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదుగురు ప్లేయర్లతో పాటు ముగ్గురు స్టాఫ్ కరోనా పాజిటివ్గా తేలడంతో అర్ధాంతరంగా లీగ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడినా, త్వరలోనే మిగిలిన మ్యాచులు నిర్వహిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు.
‘దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ను ఇక్కడ నిర్వహించలేం. అది సాధ్యం కాదు, అదీకాకుండా భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది.
కరోనా ప్రోటోకాల్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ నిర్వహించాల్సి వస్తోంది. ఆటగాళ్లను 14 రోజుల పాటు క్వారంటైన్లో పెట్టి, మ్యాచులు నిర్వహించడం చాలా కష్టమవుతోంది...
ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే అసలు ఐపీఎల్ 2021 సీజన్ను పూర్తిచేయగలమా? లేదా? అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఐపీఎల్ సక్సెస్ కావాలంటే ఫారిన్ ప్లేయర్లు కూడా కావాలి...
టీ20 వరల్డ్కప్ రానున్న ఈ టైమ్లో మిగిలిన దేశాల బోర్డులు తమ ప్లేయర్లను పంపడానికి ఒప్పుకుంటాయా? వాళ్ల షెడ్యూల్స్ వారికి ఉంటాయి...
గత సీజన్లో సెప్టెంబర్లో మ్యాచులు నిర్వహించాం. అప్పుడు అన్నిదేశాల్లో లాక్డౌన్ ఉండడంతో వీలైంది. కానీ ఇప్పుడు అలా కాదు. చాలాదేశాల్లో పరిస్థితి మెరుగైంది.
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో కరోనా కేసులు వచ్చినా, సీజన్ను కొనసాగించి పూర్తిచేశారు. కానీ ఐపీఎల్ అలా కాదు. వారం రోజులు కూడా లీగ్ను ఆపి ఉంచలేం...
ఇప్పుడు ప్లేయర్లు మళ్లీ వచ్చినా, వారికి క్వారంటైన్ ఏర్పాటుచేయాలి. మళ్లీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
ఐపీఎల్ సీజన్లో ఇంకా 31 మ్యాచులు మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్లో ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఈ మ్యాచులను 16 నుంచి 18 రోజుల్లో ముగిస్తారని టాక్ వినబడుతోంది...
అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు 15 రోజులు అందుబాటులో ఉన్నా, ఆస్ట్రేలియా, విండీస్, ఆఫ్గాన్ క్రికెటర్లు వేరే షెడ్యూల్స్తో బిజీగా ఉంటారు. దీంతో లీగ్ నిర్వహణ కష్టంగా మారుతుంది.