ఐపీఎల్ మ్యాచులన్నీ ఫిక్సింగ్ యేనా... పక్కా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నాయా?
IPL 2020 సీజన్ ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా మిగిలిన స్థానాల కోసం ఆరు జట్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ప్లేఆఫ్ బెర్త్ స్థానాలపై క్లారిటీ రావాలంటే... గ్రూప్ స్టేజ్లో జరిగే ఆఖరి మ్యాచ్ ముంబై వర్సెస్ సన్రైజర్స్ ఫలితం దాకా ఆగాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేనంత నాటకీయంగా ప్లేఆఫ్ మారడంతో అభిమానులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.
ఐపీఎల్ 2020 సీజన్ మొదటి సగం ముగిసేసరికి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి, అట్టడుగు స్థానంలో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
మరోవైపు మొదటి 9 మ్యాచుల్లో 7 మ్యాచులు గెలిచి టాప్ ప్లేస్లో నిలిచింది యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్ క్లాస్ ప్రదర్శన ఇస్తే... ఢిల్లీ జట్టు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ బెర్త్ కోసం ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
మరోవైపు 10 మ్యాచుల్లో ఏడు మ్యాచులు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ బెర్త్ కోసం ఆఖరి మ్యాచ్ దాకా ఎదురుచూడాల్సిన గతి తెచ్చుకుంది.
మరోవైపు ప్లేఆఫ్ బెర్త్ నుంచి దూరమైనట్టే అనిపించిన రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ అన్యూహ్య విజయాలతో దూసుకొచ్చి, సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.
127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక సన్రైజర్స్ లాంటి జట్లు వరుస వికెట్లు కోల్పోవడం... 195 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈజీగా ఊదేయడం... వంటి సన్నివేశాలు చూస్తుంటే నమ్మడానికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు ఎదుర్కొన్న ఓటములు కూడా నమ్మశక్యంగా లేవు. ఉత్కంఠ మ్యాచుల్లో గెలిచి టాప్ 4లో ఉన్న కేకేఆర్, ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
అసలు ఏ జట్టు మ్యాచ్ గెలుస్తుందో, ఏది ఓడిపోతుందో కూడా ఊహించలేనట్టుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మారడం పలు అనుమానాలకు తావిస్తోంది....
నాలుగు బంతుల్లో ఒక్క పరుగు తీయలేక ఓడిపోయిన మ్యాచులు, రికార్డు లెవెల్లో సూపర్ ఓవర్ మ్యాచులు జరుగుతుండడంతో ఇది పక్కా స్క్రిప్టు ప్రకారం నడుస్తున్న సీజన్ అని అనుమానిస్తున్నారు కొందరు అభిమానులు.
ఐపీఎల్ మ్యాచ్లపై కొన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ప్రతీ బంతికీ, ప్రతీ ఓవర్కి కొన్ని లక్షల సొత్తు జేబులు మారుతుంది. అందుకే ఎవ్వరూ ఊహించనంత రసవత్తరంగా సీజన్ను పక్కా స్క్రిప్ట్ ప్రకారం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొందరు అభిమానులు.
అయితే కరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఓ ఛాలెంజ్ తీసుకుని దుబాయ్లో జరుగుతున్న 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్పై ఇలాంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటున్నారు మరికొందరు ఐపీఎల్ ఫ్యాన్స్...
యూఏఈ పరిస్థితులు, పిచ్, ఇలాంటి అనేక కారణాల వల్ల ఆధిక్యం చేతులు మారుతూ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని అంటున్నారు కొందరు క్రికెట్ విశ్లేషకులు.... అనుమానించడం మానేసి మ్యాచ్లను ఎంజాయ్ చేయాలని సలహా ఇస్తున్నారు.
స్క్రిప్టు ప్రకారం నడిస్తే భారీ ఫాలోయింగ్, సపోర్ట్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్న సమయంలో ఇలాంటి అనుమానాలు, ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. 2020 ఏడాదిలోనే 2020 ఐపీఎల్ సీజన్ కూడా ఓ ఊహకందని సర్ప్రైజ్ అంటున్నారు ఐపీఎల్ వీరాభిమానులు.