IPL 2020: 13 ఏళ్లుగా ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్లు వీరే...
IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహా సమరం మొదలై 13 ఏళ్లు గడిచిపోయింది. ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితులను కూడా విజయవంతంగా టోర్నీని నిర్వహిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటిదాకా ఏ సీజన్ కూడా మిస్ కాకుండా ఆడుతున్న క్రికెటర్లు మాత్రం కొందరే. వాళ్లు ఎవ్వరంటే...
మహేంద్ర సింగ్ ధోనీ: 13 ఏళ్లుగా కెప్టెన్గా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్కే జట్టుకి 11వ సారి కెప్టెన్గా వ్యవహారిస్తున్న ధోనీ, మధ్యలో రెండేళ్లు చెన్నై జట్టుపై నిషేధం పడడంతో రైజింగ్ పూణే జట్టుకి నాయకత్వం వహించాడు.
రోహిత్ శర్మ: రోహిత్ శర్మ హిట్టింగ్ను పరిచయం చేసింది ఐపీఎల్. 2008లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకి ఆడిన రోహిత్ శర్మ, 2011 నుంచి ముంబై జట్టుకి ఆడుతున్నాడు. 2013 నుంచి ముంబై జట్టుకి కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు రోహిత్ శర్మ.
విరాట్ కోహ్లీ: 13 ఏళ్లుగా ఒకే ఒక్క జట్టులో కొనసాగుతున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2013లో ఆర్సీబీ కెప్టెన్ అయిన కోహ్లీ 2016 సీజన్లో జట్టును ఫైనల్ చేర్చాడు.
దినేశ్ కార్తీక్: ఈ సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్కి కెప్టెన్గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, ఢిల్లీ, పంజాబ్, ముంబై ఇండియన్స్, బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకి ఆడాడు. 2018 నుంచి కోల్కత్తా జట్టుకి ఆడుతున్నాడు కార్తీక్.
ఊతప్ప: ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రాబిన్ ఊతప్ప, బెంగళూరు, పూణె, కోల్కత్తా జట్లకు ఆడాడు. కోల్కత్తా నైట్రైడర్స్కి ఐదేళ్లు ఆడిన ఊతప్పను, రాజస్థాన్ రాయల్స్కి విక్రయించింది కేకేఆర్.
శిఖర్ ధావన్: యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్న శిఖర్ ధావన్, ఐపీఎల్ మొదట్లో ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. ఐదేళ్లు హైదరాబాద్లో కీ ప్లేయర్గా ఉన్న ధావన్, గత సీజన్ నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు.
పియూష్ చావ్లా: ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్న పియూష్ చావ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కత్తా నైట్రైడర్స్ జట్లకి కూడా ఆడాడు.
ఏబీ డివిల్లియర్స్: ఆర్సీబీ జట్టుకు ఆపద్భాంధవుడిగా మారిన ఏబీడీ, మొదటి సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్కి ఆడాడు. 2011 నుంచి తొమ్మొదేళ్లుగా కోహ్లీ టీమ్తో కొనసాగుతున్నాడు ఏబీ డివిల్లియర్స్. 13 ఏళ్లుగా ఏ సీజన్ మిస్ కాకుండా ఐపీఎల్ ఆడుతున్న ఒకేఒక్క విదేశీ క్రికెటర్ ఏబీడీ.
అమిత్ మిశ్రా: ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న మిశ్రా... ఐపీఎల్ మొదట్లో డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకి కూడా ఆడాడు. 159 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు మిశ్రా.
మనీశ్ పాండే: ఐపీఎల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్ మనీశ్ పాండే, కెరీర్ మొదట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఆ తర్వాత పూణే వారియర్స్, కోల్కత్తా నైట్రైడర్స్ జట్లకి ఆడి ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నాడు మనీశ్.
వృద్ధమాన్ సాహా: టెస్టు ప్లేయర్లకి ఐపీఎల్ సెట్ అవ్వదు. కానీ 13 ఏళ్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు వృద్ధమాన్ సాహా. 2008లో కోల్కత్తా నైట్రైడర్స్కి ఆడిన సాహా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకి ఆడాడు. పంజాబ్ ఆడిన ఫైనల్లో సెంచరీ చేసిన సాహా, మూడు సీజన్లుగా హైదరాబాద్కి ఆడుతున్నాడు.
పార్థివ్ పటేల్: ప్రస్తుతం బెంగళూరుకి ఆడుతున్న పార్థివ్ పటేల్కు మొదటి 3 మ్యాచుల్లో జట్టులో అవకాశం దక్కలేదు. మొదటి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి, డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకి ఆడిన పార్థివ్ పటేల్, 2018 నుంచి బెంగళూరుకి ఆడుతున్నాడు.
ధవళ్ కుల్కర్ణి: భారత జట్టుకి పెద్దగా ఆడలేకపోయినా 13 ఏళ్లుగా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు కుల్కర్ణి. మొదటి ఐదు సీజన్లు ముంబై ఇండియన్స్కి, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్ లయన్స్ జట్లకి ఆడిన కుల్కర్ణి, మళ్లీ తిరిగి ముంబైకి చేరాడు. అయితే ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో కుల్కర్ణికి అవకాశం దక్కలేదు.
రైనా, భజ్జీ మిస్: 12 సీజన్లు ఆడిన సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యారు. యూసఫ్ పఠాన్ను వేలంలో ఎవ్వరూ కొనుక్కోలేదు. భజ్జీ, రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్కు దూరమయ్యారు.