IPL 2020: సీజన్ మధ్యలో ట్రాన్స్ఫర్... వేరే జట్లలోకి వెళ్తున్న ప్లేయర్లు వీరే..
IPL 2020 సీజన్ జోరుగా సాగుతోంది. రోలర్ కోస్టర్ సీజన్లో అన్ని జట్లూ ప్లేఆఫ్ కోసం పోరాడుతున్నాయి. అయితే సీజన్ మధ్యలో ఆటగాళ్లను మార్చుకోబోతున్నాయి ఫ్రాంఛైజీలు. ఏడో రౌండ్ మ్యాచ్ల అనంతరం జరిగే ఈ బదిలీలో ఫ్రాంఛైజీ మారబోతున్న ప్లేయర్లు వీరే...
అజింకా రహానే: గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న రహానే, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు. అయితే యువకులతో నిండిన ఢిల్లీలో రహానేకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నింటిలో రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాడు రహానే. రహానే మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్లో భాగంగా పంజాబ్ జట్టుకి చేరవచ్చని అంచనా.
ధవల్ కులకర్ణి: 13 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో కులకర్ణి ఒకడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్ వంటి స్టార్ పేసర్లు ఉన్న ముంబై, కులకర్ణిని ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడించలేదు. దాంతో కులకర్ణి మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మయాంక్ మర్కండే: 2018 సీజన్లో అద్భుతంగా రాణించి, భారత జట్టులో కూడా అవకాశం దక్కించుకున్న మర్కండే... ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. యువ స్పిన్నర్న్ మయాంక్ మార్కండే కూడా దేశవాళి క్రికెట్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా మర్కండేకి ఒక్క అవకాశం దక్కలేదు. దాంతో మర్కండేని పంజాబ్ జట్టుకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆదిత్య తారే: భారీ షాట్లతో విరుచుకుపడే ఆదిత్య తారేకి జట్టులో చోటు కల్పించలేకపోయింది ముంబై ఇండియన్స్. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై, ఆదిత్య తారేని వేరే జట్టుకి ఇవ్వాలని చూస్తోంది. తారే రాజస్థాన్ రాయల్స్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రసిద్ధ్ కృష్ణ: కోల్కత్తా నైట్రైడర్స్ తరుపున గత సీజన్లో ఆకట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, ఈ సీజన్లో శివమ్ మావి, కమ్లేశ్ నాగర్కోటి రాణిస్తుండడంతో రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాడు. దాంతో ప్రసిద్ధ్ కృష్ణకు అనుభవం కోసం వేరే జట్టుకు అప్పగించనుంది కేకేఆర్.
క్రిస్ గేల్: భారీ హిట్టర్ అయిన క్రిస్గేల్ను పూర్తిగా వినియోగించుకోలేకపోతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఇప్పటిదాకా ఆడిన పంజాబ్ ఆడిన ఐదు మ్యాచుల్లో గేల్ రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాడు. దాంతో గేల్, వేరే జట్టువైపు చూస్తున్నట్టు టాక్. అయితే గేల్ను నేటి మ్యాచ్లో బరిలో దించాలని చూస్తోంది పంజాబ్. భారీ స్టార్స్తో సతమతమవుతున్న పంజాబ్, తుది జట్టు కూర్పులో సమస్యలు ఎదుర్కుంటోంది.
కుల్దీప్ యాదవ్: కోల్కత్తా నైట్రైడర్స్ జట్టులో కొనసాగుతున్న సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. గత సీజన్లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ను సరిగా వాడడం లేదు కేకేఆర్. కొన్ని మ్యాచుల్లో దాదాపు ఇన్నింగ్స్ ముగిసే సమయంలో కుల్దీప్కి బంతి ఇవ్వడం చూస్తుంటే... మనోడిపై ఉన్న నమ్మకం ఏంటో అర్థం అవుతోంది. దీంతో కుల్దీప్ మరో ఫ్రాంఛైసీకి బదిలీ కావాలని చూస్తున్నాడని టాక్.