INDvsENG 2nd test: దంచికొడుతున్న రోహిత్ శర్మ... ఆటకు బ్రేకేసిన వరుణుడు...
ఇంగ్లాండ్ టూర్లో ప్రత్యర్థి బౌలర్ల కంటే ఎక్కువగా వరుణుడు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన రెండో టెస్టులో మొదటి సెషన్ పూర్తి కాకుండానే మళ్లీ వరుణుడు పలకరించాడు. తొలి ఇన్నింగ్స్లో 18.4 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది...
తొలి టెస్టులో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి శుభారంభం అందించిన రోహిత్, కెఎల్ రాహుల్ మరోసారి భారత జట్టుకి మంచి ఆరంభం అందించారు...
రోహిత్ శర్మ 66 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేయగా... కెఎల్ రాహుల్ 46 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు... తొలి టెస్టులో రాహుల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే, నేటి మ్యాచ్లో రోహిత్ ఆ బాధ్యత తీసుకున్నాడు...
సామ్ కుర్రాన్ వేసిన 13వ ఓవర్లో తొలి బౌండరీ సాధించిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 15వ ఓవర్లో నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు... ఆ తర్వాతి ఓవర్లో కూడా రోహిత్ ఓ బౌండరీ బాదడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్లో మార్పులు చేయాల్సి వచ్చింది...
రోహిత్ శర్మ ఓపెనర్గా అవతారం ఎత్తిన తర్వాత ఈ ఏడాది విదేశాల్లో భారత జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా మెరుగైంది. 2018లో సగటును ఓపెనింగ్ భాగస్వామ్యం 7.2 ఓవర్లు కొనసాగితే, 2019లో అది 6.1 ఓవర్లకు పడిపోయింది... 2020లో అయితే కేవలం 3.3 ఓవర్లకే పడిపోయింది.
2021 సీజన్లో భారత తొలి వికెట్ భాగస్వామ్యం సగటున 19.1 ఓవర్ల పాటు కొనసాగుతోంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 37.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 10.5 ఓవర్లే బ్యాటింగ్ చేయగలిగారు...
ఇంగ్లాండ్లో తొలి వికెట్కి 100కి పైగా బంతులను రెండుసార్లు ఎదుర్కొన్న భారత ఓపెనింగ్ జోడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్. ఇంతకుముందు భారత ఓపెనర్లు ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు...