కెఎల్ రాహుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ అవుట్... అయినా తొలిరోజు ఆధిక్యం మనదే...
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం చూపించింది. ఓపెనర్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్లతో ఆకట్టుకోగా... భారత సారథి విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నా హాఫ్ సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది... కెఎల్ రాహుల్ 248 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 127 పరుగులు చేయగా అజింకా రహానే 22 బంతుల్లో 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి సెంచరీ ముంగిట పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో ఆరో సెంచరీని నమోదుచేశాడు. లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్...
1952లో వినూ మన్కడ్, 1990లో రవిశాస్త్రి ఓపెనర్గా వచ్చి లార్డ్స్లో సెంచరీ నమోదుచేశారు. కెఎల్ రాహుల్కి ఇంగ్లాండ్పై ఇది మూడో టెస్టు సెంచరీ కావడం మరో విశేషం...
2016 తర్వాత విదేశాల్లో మూడు సెంచరీలు చేసిన ఓపెనర్గా కెఎల్ రాహుల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు...
అంతకుముందు 145 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 83 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అండర్సన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు... తొలి వికెట్కి కెఎల్ రాహుల్తో కలిసి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ...
2002లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత ఓపెనర్గా నిలిచాడు రోహిత్ శర్మ... లార్డ్స్లో ఇంతకుముందు కపిల్దేవ్, సెహ్వాగ్, ఆశీష్ నెహ్రా, అజింకా రహానే టెస్టుల్లో సిక్స్ బాదారు...
టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రెండో భారత జోడిగా నిలిచారు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ. ఇంతకుముందు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే మూడు ఫార్మాట్లలో తొలి వికెట్కి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు...
రోహిత్ శర్మ అవుటైన తర్వాత 23 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
150 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్కి 117 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత కోహ్లీ అవుట్ అయ్యాడు..
103 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఓల్లీ రాబిన్సన్ బౌలింగ్లో జో రూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్లో ఆరోసారి 100కు పైగా బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ (5 సార్లు)లకు అధిగమించాడు...