INDvsENG: రెండో టెస్టుకి ప్రేక్షకులకు అనుమతి... గైడ్లైన్స్ ప్రకటించిన బీసీసీఐ...
ప్రేక్షకులు లేకుండానే మొదటి టెస్టును నిర్వహించిన బీసీసీఐ, చెన్నైలోనే జరగనున్న రెండో టెస్టుకు అభిమానులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకి హాజరయ్యే అభిమానులకు కొన్ని గైడ్లైన్స్ను విడుదల చేసింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్.
30 వేల మంది కెపాసిటీ ఉన్న చెపాక్ ఏంఏ చిదంబరం స్టేడియంలోకి 50 శాతం మందిని అంటే 15 వేల మందిని అనుమతించాలని భావిస్తోంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. అయితే క్రికెటర్లకు దగ్గరగా ఉండే స్టాండ్లను మూసివేసి, దూరంగా ఉండే ఐ, జే, కే స్టాండ్లను తెరవనున్నారు. 2012 నుంచి ఈ స్టాండ్లను మూసివేసి ఉంచారు.
స్టేడియంలోకి వచ్చే ప్రతీ ప్రేక్షకుడు తప్పనిసరిగా ఫేస్ మాస్కును ధరించాల్సి ఉంటుంది. ఈ మాస్కు ముక్కు, నోరుని కవర్ చేసే విధంగా ఉండాలి. అవసరమైతే రెండు మాస్కులు తీసుకురావాల్సి ఉంటుంది...
స్టేడియం లోపల భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినవారికి స్టేడియంలోకి అనుమతి ఉండదు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ మాదిరిగానే స్టేడియంలోపలికి వచ్చే ముందు ప్రేక్షకుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు సెక్యూరిటీ సిబ్బంది...
సిడ్నీస్టేడియంలో, గబ్బా స్టేడియంలో మహ్మద్ సిరాజ్కి ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా... మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులు ఎవ్వరైనా జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. అంతేకాకుండా మతపరమైన, రాజకీయ, అసభ్యకరమైన కామెంట్లు చేయరాదు...
కరోనా ప్రోటోకాల్ను, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. అలగే మైదానంలోకి బ్యాగులు, సూట్ కేసులు, రేడియోలు, లేజర్ పాయింటర్లు, ల్యాప్ ట్యాప్లు, టేప్ రికార్డులు, బైనాక్యూలర్లు, సంగీత పరికరాలు, వీడియో కెమెరాలు తీసుకురావడాన్ని నిషేధించింది బీసీసీఐ.
గత ఏడాది నుంచి భారతదేశంలో ఎలాంటి క్రీడాకార్యక్రమాలు జరగలేదు. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ను యూఏఈ వేదికగా నిర్వహించింది బీసీసీఐ. సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి కూడా ప్రేక్షకులను అనుమతించలేదు. ఫిబ్రవరి 8 నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయిస్తోంది బీసీసీఐ.