INDvsAUS: అజింకా రహానే అద్భుత సెంచరీ... సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొట్టిన కెప్టెన్...
మొదటి టెస్టులో విరాట్ కోహ్లీని రనౌట్ చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అజింకా రహానే... బాక్సింగ్ డే టెస్టులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాకు వరుసగా 4, 5, 6వ వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నెలకొల్పి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు రహానే. భారత జట్టుకి మంచి ఆధిక్యాన్ని అందిస్తూ, బాక్సింగ్ డే టెస్టులో పట్టు సాధించే దిశగా తీసుకెళ్తున్నాడు తాత్కాలిక కెప్టెన్ రహానే. రెండో రోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి 91.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది టీమిండియా. అజింకా రహానే 104 పరుగులతో రవీంద్ర జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 82 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు.
రెండో రోజు ఆటకు కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. టీ బ్రేక్ తర్వాత తిరిగి ఆరంభమైన ఆటను కొత్త బంతితో ఆరంభించింది ఆస్ట్రేలియా...
మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్లో అజింకా రహానే ఇచ్చిన క్యాచ్ను స్టీవ్ స్మిత్ జారవిరిచాడు. అనుకోకుండా దక్కిన అదృష్టంతో బతికిపోయిన రహానే, ఆ తర్వాత దూకుడుగా ఆడాడు...
స్టార్క్, కమ్మిన్స్, హజల్వుడ్... ఇలా ఎంత మంది బౌలర్లకు మార్చినా ఆసీస్కి వికెట్ మాత్రం దక్కలేదు.
విహారితో కలిసి నాలుగో వికెట్కి 52 పరుగులు, రిషబ్ పంత్తో కలిసి ఐదో వికెట్కి 57 పరుగులు జోడించిన అజింకా రహానే... రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
197 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అజింకా రహానే. ఆస్ట్రేలియాలో రహానేకి ఇది రెండో సెంచరీ కాగా మెల్బోర్న్ స్టేడియంలో కూడా రెండో సెంచరీ.
1999లో సచిన్ టెండూల్కర్ తర్వాత మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో సెంచరీ చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు అజింకా రహానే.
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేయడం అజింకా రహానేకి ఇది రెండోసారి. 2014లో 147 పరుగులతో రాణించాడు అజింకా రహానే..
ఓవరాల్గా బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన ఐదో క్రికెటర్గా నిలిచాడు రహానే. ఇంతకుముందు సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, పూజారా ఈ ఫీట్ సాధించారు...
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన ఐదో భారత కెప్టెన్ అజింకా రహానే... ఇంతకుముందు సచిన్, గంగూలీ, అజారుద్దీన్, కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
టెస్టుల్లో రహానేకి ఇది 12వ సెంచరీ. టెస్టుల్లో సెంచరీ చేసిన 12వ కెప్టెన్గానూ రికార్డు క్రియేట్ చేశాడు రహానే...
90 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది టీమిండియా. 78 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది భారత జట్టు.