విరాట్ కోహ్లీ టీమ్తో పాటే మహిళా జట్టు కూడా... మొట్టమొదటిసారి పురుషుల జట్టుతో కలిసి వుమెన్స్ టీమ్...
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్కి వెళ్లనుంది. ఇదే సమయంలో భారత మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్ టూర్కి వెళ్తోంది. దీంతో ఇరు జట్లను ఒకే విమానంలో పంపాలని భావిస్తోందట బీసీసీఐ.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించాయి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లు. దీంతో భారత జట్టు కోసం ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయనుంది బీసీసీఐ..
జూన్ 2న ఇంగ్లాండ్కి పయనమయ్యే ఈ ఛార్టెడ్ ఫ్లైట్లో ఒకేసారి విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల జట్టు, మిథాలీరాజ్, హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళా జట్టు లండన్కి చేరబోతున్నారు.
భారత క్రికెట్ చరిత్రలోనే పురుషుల క్రికెట్ జట్టు, మహిళా క్రికెట్ జట్టు కలిసి ఒకే విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి... విరాట్ టీమ్ సెప్టెంబర్ మధ్యదాకా అక్కడే ఉంటే, మహిళా జట్టు జూలై నెలాఖరున స్వదేశానికి తిరిగి రానుంది...
ఇప్పటికే ఇంగ్లాండ్కి వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్ ఒక్కటే బయలుదేరుతుందని, ఆ లోపు ఏ క్రికెటర్ కూడా కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని... ఏ ప్లేయర్ అయినా కరోనా బారిన పడితే, అతను జట్టులో చోటు కోల్పోతాడని సూచించింది బీసీసీఐ.
ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే భారత పురుషుల, మహిళల జట్లు మే 19 నుంచే క్వారంటైన్లో వెళ్లబోతున్నారు. జూన్ 2న ఇంగ్లాండ్కి పయనమై, లండన్ చేరిన తర్వాత అక్కడ కూడా క్వారంటైన్లో గడుపుతారు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలబడే టీమిండియా, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత నెలన్నర రోజులు ఇంగ్లాండ్లోనే గడపనుంది. ఇదే సమయంలో వన్డే, టీ20 ప్లేయర్లతో కూడిన మరో జట్టు శ్రీలంక టూర్కి వెళ్లనుంది.
అయితే ఇంగ్లాండ్లో ఉన్న టీమిండియాకి ప్రాక్టీస్గా ఐర్లాండ్తో టీ20, వన్డే సిరీస్ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఇంగ్లాండ్తో టెస్టుల ఆరంభమయ్యే కంటే ముందే ఐర్లాండ్తో సిరీస్ ఆడనుంది టీమిండియా.
మరోవైపు 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడబోతోంది భారత మహిళా జట్టు. ఇంగ్లాండ్తో జరిగే ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగుస్తుంది.