Yuvraj Singh Arrest: నిత్యం వివాదాల్లోనే.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన యువరాజ్ సింగ్
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆదివారం అరెస్టైన విషయం తెలిసిందే. కులం పేరుతో దూషించారనే ఆరోపణతో యువరాజ్ అరెస్టయ్యారు. అయితే గతంలో కూడా యువరాజ్ వివాదాల్లో చిక్కుకున్నాడు.
భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మరోసారి వార్తల్లోకెక్కాడు. కుల వివక్ష (caste Based allegations) వ్యాఖ్యలు చేసినందుకు గాను యువరాజ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం పంజాబ్-హర్యానా కోర్టు (Punjab-haryana High court) ఆదేశాల మేరకు అరెస్టైన ఈ ఆల్ రౌండర్.. సొంత పూచీకత్తుతో విడుదలయ్యాడు. అయితే అంతకుముందు కూడా యువరాజ్ పలు వివాదాల్లో (Yuvraj controversies) చిక్కుకున్నాడు. అవేంటో చూద్దాం.
గతంలో యువరాజ్ బంధువు ఆకాంక్ష శర్మ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు మాధక ద్రవ్యాలు (Drugs) సేవిస్తాడని ఆమె ఆరోపించింది. బిగ్ బాస్ 10 సీజన్ లో మెరిసిన ఆకాంక్ష.. యువరాజ్ పై చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి.
యువరాజ్ సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Randas Athavale) ఆరోపించారు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్థాన్ (pakistan) పై భారత్ (india) ఓటమి అనంతరం ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ లో యువరాజ్, విరాట్ కోహ్లి ఫిక్సింగ్ కు పాల్పడ్డారని రాందాస్ విమర్శించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) కారణంగానే తన కొడుకు జట్టు నుంచి దూరమయ్యాడని యువరాజ్ తండ్రి యోగరాజ్ ఆరోపించాడు. ఈ వివాదం చాలా కాలం నడిచింది. యువరాజ్.. ఫామ్ లేమితో జట్టు నుంచి చోటు కోల్పోయినప్పుడు యోగరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై యువరాజ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చాడు. తనకు ధోనితో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు.
కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది (shahid afridi) కి మద్దతుగా నిలిచినందుకు యువరాజ్ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఎన్జీవో స్థాపించిన అఫ్రిదికి అతడు విషెస్ చెబుతూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అఫ్రిది భారత ప్రధాని మోదీ (PM Modi)ని విమర్శించాడు. దీనిపై యువరాజ్ మాట్లాడుతూ.. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతు ప్రకటించనని చెప్పాడు.
ఇక బాలీవుడ్ తో భారత క్రికెట్ కు ఉండే సంబంధాలు బహిరంగ రహస్యమే. క్రికెటర్ గా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో యువరాజ్.. బాలీవుడ్ నటి కిమ్ శర్మ (ఖడ్గం హీరోయిన్) తో డేటింగ్ చేశాడని వార్తలొచ్చాయి. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో గానీ వీళ్లిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కిమ్ శర్మ.. భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో డేటింగ్ చేస్తుండగా.. యువరాజ్ సింగ్ మరో బాలీవుడ్ హీరోయిన్ హెజెల్ కీచ్ ను పెళ్లి చేసుకున్నాడు.
ఇక తాజాగా.. 2020 జూన్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో (rohit sharma) కలిసి యువరాజ్ సింగ్ ఇన్స్ట్రాగ్రామ్ లైవ్లో (insta live) మాట్లాడాడు. ఆ సందర్భంగా యుజేంద్ర చాహల్పై (yuzvendra chahal) యూవీ సరదాగా కామెంట్లు చేశాడు. చాహల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు చేస్తున్నాడని.. బాంగీ మనుషుల్లా (bungy cast) వీళ్లకు పని పాటా లేదా అంటూ వ్యాఖ్యానించాడు.
ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది.అయితే దళితులను (dalits) అవమానించేలా యువరాజ్ కామెంట్స్ ఉన్నాయని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆ మాటలకు యువరాజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే హర్యానాలోని హిస్సార్ పోలీస్ స్టేషన్లో (hisar police station) యువరాజ్ సింగ్పై కేసు నమోదైంది. దళిత హక్కుల నేత రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.