నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం, కావాలని పాక్ని గెలిపించావ్... టీమిండియా ఓటమి తర్వాత మహ్మద్ షమీపై తీవ్రమైన...
భారతీయులకు అభిమానం వచ్చినా, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేం. టీ20 వరల్డ్కప్ 2021లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉంటే, ఇప్పటికి సీన్ వేరేగా ఉండేది. భారత క్రికెటర్ల ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగేది. బయట కూడా టపాకాయలు పేలుస్తే, భారత జెండాలను చేతబట్టి బైక్లపై ర్యాలీలు చేస్తూ నినాదాలు చేసేవాళ్లు. వారికి ఆ ఆనందాన్ని లేకుండా చేసింది పాకిస్తాన్...
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపడకుండా ఎదుర్కొన్నారు. యార్కర్లు వేసినా, షార్ట్ పిచ్ బంతులు వేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా పరుగులు రాబట్టారు.
దాదాపు 18 ఓవర్ల పాటు సాగిన పాక్ ఇన్నింగ్స్లో బంతి కాళ్లను తాకడం కానీ, ఒక్కటంటే ఒక్క క్యాచ్ రావడం కానీ జరగలేదంటూ పాక్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ల బ్యాటింగ్ ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు...
షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీ, షాదబ్ ఖాన్, హరీస్ రౌఫ్ వంటి పాక్ బౌలర్లు అదరగొట్టి, భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన చోట... వారికంటే ఎంతో అనుభవం ఉన్న మన బౌలర్లు వికెట్ తీయలేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది...
దీంతో భారత బౌలర్లను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలతో పాటు మహ్మద్ షమీ ఈ ట్రోల్స్ను తీవ్రంగా ఎదుర్కొంటున్నాడు.
మహ్మద్ షమీ వేసిన మొదటి 3 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి భువీ, బుమ్రాల కంటే బెటర్గానే పర్ఫామ్ చేశాడు. అయితే షమీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం అతను ముస్లిం మతస్థుడు కావడమే...
విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన దశలో షమీకి బాల్ అందించారు కోహ్లీ అండ్ కో. ఎవరికి బాల్ ఇవ్వాలనే విషయంపై చాలా సేపు చర్చ జరిగి, షమీకి బంతి ఇవ్వడం జరిగింది...
అప్పటికే క్రీజులో కుదురుకుపోయిన బ్యాట్స్మెన్ కావడం, చేతిలో పది వికెట్లు ఉండడంతో షమీ వేసిన 18వ ఓవర్ను టార్గెట్ చేశారు రిజ్వాన్, బాబర్ ఆజమ్. తొలి బంతికి సిక్సర్, ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదిన రిజ్వాన్, నాలుగో బంతికి సింగిల తీయగా... బాబర్ ఆజమ్ 2 పరుగులు తీసి మ్యాచ్ను ముగించేశాడు.
‘సర్ టీమిండియా ఓడిపోయింది, అయితే మీరు సంతోషిస్తూ ఉండొచ్చు. మీ వాళ్ల టీమ్ గెలిచింది కదా... సారీ మీరే గెలిపించారు...’ అంటూ తీవ్రంగా దూషిస్తూ, అసభ్యపదజలంతో మహ్మద్ షమీపై దాడికి పాల్పడుతున్నారు నెటిజన్లు...
మహ్మద్ షమీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలలో అతని వ్యక్తిగత జీవితంపై కూడా బూతులు తిడుతున్నారు. తన భార్య హసీన్ జాహాన్, కూతుర్లపై కూడా అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
మహ్మద్ షమీ తన బౌలింగ్తో భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించాడు. బుమ్రా ఒక్క వికెట్ తీయలేకపోయిన ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఇంగ్లాండ్ టూర్లో ఇంగ్లీష్ క్రికెటర్లు బుమ్రాని టార్గెట్ చేసి, బౌన్సర్లు వేస్తుంటే అవతలి ఎండ్లో బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ బాది... టీమిండియా సత్తా ఏంటో చూపించాడు. అలాంటి షమీపై ఇలాంటి దూషణలు చేయడం, నిజమైన క్రికెట్ ఫ్యాన్స్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...
మొన్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన తర్వాత డాన్ క్రిస్టియన్ని, అతని భార్య ఇన్స్టాగ్రామ్ ఫోటోలపై అసభ్యపదజాలంతో దాడి చేసిన నెటిజన్లు, ఇప్పుడు మహ్మద్ షమీ ముస్లిం కావడంతో అతనిపై ఇలా విరుచుకపడుతున్నారు...
‘మహ్మద్ షమీపై జరుగుతున్న ఆన్లైన్ అటాక్ చూసి షాక్ అయ్యా. మేం నీతో ఉన్నాం. నువ్వు ఓ ఛాంపియన్వి. భారత జెర్సీ వేసుకుని, టీమిండియా క్యాప్ పెట్టుకునే ప్రతీ ప్లేయర్ను ఇండియా తన గుండెల్లో పెట్టుకుని చూసి ఉంటుంది. ఇలాంటి ఆన్లైన్ హింసలు, వారిని ఏమీ చేయలేవు. నీతో ఉన్నా షమీ... తర్వాతి మ్యాచ్లో నువ్వేంటో వీళ్లకు చూపించు...’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
మహ్మద్ షమీపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిని వ్యతిరేకిస్తూ... ‘WE stand with Shami’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ, భారత పేసర్కి అండగా ఉంటామని తమ సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు..