న్యూజిలాండ్ని ఆలౌట్ చేయలేరు, కాబట్టి డ్రా కోసమే ప్రయత్నించండి... సునీల్ గవాస్కర్ కామెంట్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వర్షం అంతరాయం కారణంగా ఫలితం తేలేందుకు రిజర్వు డే కీలకంగా మారింది. అయితే భారత జట్టు జాగ్రత్తగా ఉండకపోతే మ్యాచ్ను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
తొలి ఇన్నింగ్స్లో 32 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకున్న న్యూజిలాండ్, ఆరో రోజు వీలైనంత త్వరగా టీమిండియాను ఆలౌట్ చేసి, రెండో ఇన్నింగ్స్ మొదలెట్టాలని చూస్తోంది...
‘టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ పర్ఫామెన్స్ చూస్తుంటే, మనవాళ్లు వాళ్లను రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ చేయలేరని అనిపిస్తోంది. టీమిండియా, సాధ్యమైనంత త్వరగా పరుగులు చేసి, న్యూజిలాండ్కి ఓ టార్గెట్ ఇవ్వాలని ప్రయత్నించొచ్చు...
అయితే అతి పెద్దగా వర్కవుట్ కాదు. సౌంతిప్టన్ పిచ్లో మనకంటే న్యూజిలాండ్ బాగా బ్యాటింగ్ చేయగలమని తొలి ఇన్నింగ్స్లో లీడ్ సాధించి నిరూపించుకున్నారు. ఇప్పుడు వాతావరణం కూడా వారికే సపోర్ట్ చేస్తోంది...
రిజర్వు డేన పిచ్ మీద కొద్దిగా పచ్చిక ఉంది. కాబట్టి ఇలాంటి పిచ్లపైన బ్యాటింగ్ బాగా అలవాటున్న కివీస్ బ్యాట్స్మెన్ ఈజీగా స్కోరు చేయగలరు. అదే మనవాళ్లు పరుగులు చేయడం చాలా కష్టమవుతుంది...
ఎలా చూసుకున్నా రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు, న్యూజిలాండ్ను ఆలౌట్ చేయలేరు. రెండో ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీయాలంటే మనవాళ్లు అద్భుతం చేయాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.
తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను ఆలౌట్ చేసేందుకు భారత జట్టు 99.2 ఓవర్లు బౌలింగ్ వేయాల్సి వచ్చింది. టీమిండియా మాత్రం ఏడు ఓవర్లు ముందగానే చేప చుట్టేసింది...
ఆరో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్కి దక్కిన ఆధిక్యం తీసి వేయగా మిగిలింది 98 పరుగులే. దీంతో రెండో సెషన్లో భారత జట్టు ఎలా ఆడుతుందనేది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది.