మహిళల ప్రపంచకప్ : టీమిండియా సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయి?
India Women : భారత్ మహిళా జట్టు వరుసగా రెండు పరాజయాల తర్వాత సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇంకా రెండు విజయాలు సాధిస్తే టాప్-4లో చేరే అవకాశం ఉంది. ఉమెన్స్ వరల్డ్ కప్ లో టీమిండియాకు సెమీస్ రేస్ ఛాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం.

మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ నియమాలు ఏమిటి?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ప్రస్తుతం భారత్, శ్రీలంకలు వేదికలుగా జరుగుతోంది. ఈసారి టాప్ 8 జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడుతున్నాయి. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కసారి ఆడుతుంది. ఈ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
• ప్రతి విజయానికి రెండు పాయింట్లు ఉంటాయి.
• టై లేదా రద్దయిన మ్యాచ్లకు ఒక్క పాయింట్.
• పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు.
• సెమీస్లో మొదటి జట్టు నాలుగో జట్టుతో, రెండో జట్టు మూడో జట్టుతో తలపడుతుంది.
అంటే భారీ తేడాతో గెలుపులు సాధించడం, మెరుగైన NRR ఉంచుకోవడం సెమీఫైనల్ టికెట్కు కీలకం.
ఆరంభంలో భారత జట్టు జోరు..
హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ మహిళా జట్టు అద్భుతంగా టోర్నమెంట్ను ప్రారంభించింది. తొలి మ్యాచ్లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో (DLS పద్ధతిలో) ఓడించింది. రెండో మ్యాచ్లో పాకిస్థాన్పై 88 పరుగుల తేడాతో గెలుపొందింది.
కానీ ఆ తర్వాత భారత జట్టు స్థితి మారింది. దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఓటమి ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో రిచా ఘోష్ 77 బంతుల్లో 94 పరుగులతో మెరిసినా ఫలితం భారత్ వైపు రాలేదు.
తర్వాత విశాఖపట్నంలో ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. స్మృతి మంధనా, ప్రతికా రావల్ హాఫ్ సెంచరీలు చేశారు. కానీ, అలీస్సా హీలీ 142 పరుగుల సెంచరీ నాక్ తో ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజ్ను నమోదు చేసింది.
పాయింట్స్ టేబుల్లో భారత్ స్థానం ఏమిటి?
ప్రస్తుతం భారత్ నాలుగు మ్యాచ్ల్లో రెండు గెలిచి, రెండు ఓడింది. మొత్తం నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉన్నా, NRR తక్కువగా ఉండడం వల్ల భారత్ ముందుంది. ఇక ఆస్ట్రేలియా (+1.353 NRR) టాప్లో ఉండగా, ఇంగ్లాండ్ (+1.757) రెండో స్థానంలో ఉంది. భారత్ (+0.682) తరువాత ఉంది.
భారత జట్టుకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి . ఇంగ్లాండ్, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ లతో రాబోయే మ్యాచ్ లను ఆడనుంది. ఇవే సెమీఫైనల్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
భారత్ సెమీఫైనల్ కు చేరేనా?
భారత జట్టు ప్రస్తుతం 4 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే మొత్తం 8 పాయింట్లు సాధించవచ్చు. అది సాధారణంగా టాప్-4లో చోటు సంపాదించేందుకు సరిపోతుంది. నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. మూడు గెలిస్తే (10 పాయింట్లు) భారత్ ఖచ్చితంగా సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది.
అయితే రెండు మాత్రమే గెలిస్తే, నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. న్యూజీలాండ్ లేదా దక్షిణాఫ్రికా మరిన్ని విజయాలు సాధిస్తే భారత్పై ఒత్తిడి పెరుగుతుంది. ఒకటి లేదా రెండు ఓడిపోతే, భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
భారత్ మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్
- భారత్ vs ఇంగ్లాండ్ అక్టోబర్ 19 ఇండోర్
- భారత్ vs న్యూజీలాండ్ అక్టోబర్ 23 నేవీ ముంబై
- భారత్ vs బంగ్లాదేశ్ అక్టోబర్ 26 నవీ ముంబై
భారత్ ఈ మూడు మ్యాచ్లలో కనీసం రెండింట్లో గెలిస్తే సెమీస్కు అవకాశాలు ఉంటాయి.
సెమీఫైనల్స్ ఎప్పుడు?
మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29న గువాహతిలో జరగనుంది. రెండవ సెమీఫైనల్ అక్టోబర్ 30న నేవీ ముంబైలో ఉంటుంది. ఫైనల్ నవంబర్ 2న జరగనుంది. అన్ని నాకౌట్ మ్యాచ్లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి.