6 నెలల క్రితం జట్టులో కూడా లేడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్గా... కెఎల్ రాహుల్ టైం మామూలుగా లేదు...
కెఎల్ రాహుల్... ఇప్పుడు ఈ ప్లేయర్ని చూసి అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా కుళ్లుకుంటున్నారు. దీనికి కారణం అతని టాలెంట్ కాదు, రాహుల్ లక్ చూసి...
ఆస్ట్రేలియా టూర్ 2018-19లో మురళీ విజయ్తో కలిసి ఓపెనింగ్ చేసిన కెఎల్ రాహుల్, అక్కడ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... ఆ తర్వాత టెస్టు టీమ్కి దూరమయ్యాడు...
వన్డే, టీ20 ఫార్మాట్లో టాప్ ప్లేయర్గా కొనసాగుతున్నా, టెస్టుల్లో మాత్రం కెఎల్ రాహుల్కి ప్లేస్ ఉండేది కాదు. ఆస్ట్రేలియా టూర్ 2020-21లో, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కెఎల్ రాహుల్కి అవకాశం దక్కలేదు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడని కెఎల్ రాహుల్, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్కి కూడా మూడో ఓపెనర్గానే చోటు దక్కించుకున్నాడు...
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడిన శుబ్మన్ గిల్ గాయపడి, ఇంగ్లాండ్ సిరీస్కి దూరమయ్యాడు. తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో కెఎల్ రాహుల్, ఆఖరి నిమిషంలో తుదిజట్టులోకి వచ్చాడు...
అంతే... అక్కడి నుంచి కెఎల్ రాహుల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. తొలి టెస్టులో కెఎల్ రాహుల్, రోహిత్ భాగస్వామ్యం క్లిక్ కావడంతో ఇంగ్లాండ్ సిరీస్కి మొదట ఓపెనర్గా అనుకున్న మయాంక్ అగర్వాల్, టూర్ మొత్తం రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది...
ఇంగ్లాండ్లో సెంచరీ చేసి, ఓపెనర్గా తన ప్లేస్కి తిరిగి కన్ఫార్మ్ చేసుకున్న కెఎల్ రాహుల్... టెస్టుల్లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. అజింకా రహానే పేలవ ఫామ్, రోహిత్ శర్మ గాయం కూడా కెఎల్ రాహుల్ లక్ని మరింత పెంచేశాయి...
అజింకా రహానే వరుసగా విఫలం అవుతుండడంతో టెస్టుల్లో వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంచుకున్నారు సెలక్టర్లు. అయితే రోహిత్ గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి వైదొలగడంతో ఆ పొజిషన్లోకి కెఎల్ రాహుల్ వచ్చాడు...
వైస్ కెప్టెన్గా ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్, ఆ తర్వాతి టెస్టులోనే కెప్టెన్గా ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం... రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ గాయపడడంతో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్కి సారథ్య బాధ్యతలు దక్కాయి...
ఆరు నెలల క్రితం కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, 2022లో మొదటి టెస్టుకి టీమిండియా కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు...
కేవలం ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ కెప్టెన్సీ అనుభవంతో టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు కెఎల్ రాహుల్. ఇంతకుముందు అజింకా రహానే, ఎలాంటి ఫస్ట్ క్లాస్ కెప్టెన్సీ అనుభవం లేకుండా భారత టెస్టు జట్టును నడిపించాడు...
ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ కూడా కేవలం ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ కెప్టెన్సీ అనుభవంతో టీమిండియా టెస్టు కెప్టెన్గా మారాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్తో పాటు విరాట్ కోహ్లీలకు టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి ముందు మూడు ఫస్ట్ క్లాస్ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది...
సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కి కూడా కెఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు భావి సారథిగా కెఎల్ రాహుల్ను పరిగణిస్తున్నారు సెలక్టర్లు...