‘నో బాల్’కి అవుటైన హనుమ విహారి... మరోసారి సఫారీ టూర్లో అంపైరింగ్ నిర్ణయాలపై..
టీమిండియాని ప్రత్యర్థి బౌలర్ల కంటే ఎక్కువగా విసిగిస్తున్నాయి అంపైర్ల తప్పుడు నిర్ణయాలు. తాజాగా సౌతాఫ్రికా టూర్లో జోహన్బర్గ్లో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఇలాంటి ఓ నిర్ణయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, రెండో టెస్టు ఆరంభానికి ముందు వెన్నునొప్పితో బాధపడుతుండడం, శ్రేయాస్ అయ్యర్ కడుపు నొప్పితో బాధపడుతుండడంతో హనుమ విహారికి ఏడాది తర్వాత తుదిజట్టులో చోటు దక్కింది...
ఛతేశ్వర్ పూజారా 33 బంతుల్లో 3 పరుగులు, అజింకా రహానే గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారి, నాలుగో వికెట్కి కెఎల్ రాహుల్తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...
53 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన హనుమ విహారి, కగిసో రబాడా ఓవర్లో వాన్ దేర్ దుస్సేన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్కి పెవిలియన్ చేరాడు...
అయితే టీవీ రిప్లైలో రబాడా వేసిన ఆ బంతి ‘నో బాల్’గా కనిపించింది. రబాడా ఆ బంతి వేసినప్పుడు అతని కాలు, లైన్ను దాటి బయటికి వచ్చినట్టు క్లియర్గా కనిపించింది...
హనుమ విహారి అవుటైన తర్వాత కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
రవిచంద్రన్ అశ్విన్ 50 బంతుల్లో 6 ఫోర్లతో 46 పరుగులు చేయడంతో, టీమిండియా ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది, లేదంటే 200 కూడా దాటేది కాదు...
మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఆన్ ఫీల్డ్ అంపైర్, నో బాల్ను గుర్తించలేకపోతే... ఆఫ్ ఫీల్డ్ థర్డ్ అంపైర్ ఆ విషయాన్ని గుర్తించి, సైరన్ ద్వారా తెలియచేయాల్సి ఉంటుంది...
అలాగే ప్రతీ బ్యాట్స్మెన్ అవుటైన తర్వాత ఓ సారి ఆ బాల్ సరైనదా లేక, ‘నో బాల్’ ఆ... అని సరిచూసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది ఐసీసీ...
అయితే హనుమ విహారి అవుట్ విషయంలో ఈ రెండూ జరగలేదు. దీంతో భారత జట్టు కీలక సమయంలో వికెట్ కోల్పోయి తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది...
ఇంతకుముందు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ అవుట్ విషయంలో వివాదం రేగినట్టే, హనుమ విహారి అవుట్ విషయంలోనూ రచ్చ జరుగుతోంది. భారత జట్టును ఎదుర్కోలేక సఫారీ టీమ్, ఈ విధంగా థర్డ్ అంపైర్తో కలిసి ఛీటింగ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు అభిమానులు...