Ind Vs Nz: ఢిల్లీ టు టీమిండియా.. శిఖర్ ధావన్ నుంచి శ్రేయస్ దాకా.. టెస్ట్ క్రికెట్ కు ఊతమిస్తున్న ఐపీఎల్ జట్టు
Delhi Capitals: ఐపీఎల్ రావడానికి కొన్నాళ్ల ముందు భారత క్రికెట్ అంటే మహారాష్ట్ర. ఆ రాష్ట్రం నుంచే చాలా మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కానీ కాలం మారింది. ఇప్పుడంతా ఐపీఎల్ మేనియా. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్న పలువురు ఆటగాళ్లు.. తమ తొలి టెస్టులో అదిరిపోయే ఆరంభాలిస్తున్నారు.
ఒకప్పుడు భారత క్రికెట్ అంటే ఎక్కువ మంది మహారాష్ట్ర వైపే చూసేవారు. నాటి సునీల్ గవాస్కర్.. నిన్నటి సచిన్ టెండూల్కర్.. నేటి రోహిత్ శర్మ దాకా అందరి చూపు దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై మీదే. చాలా మంది క్రికెటర్లు మహారాష్ట్ర నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
భారత క్రికెట్ జట్టులోకి రావాలంటే.. రంజీలలో రాణించి, దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టి, భారీ టోర్నీలలో మెరిసినా తుది జట్టులో చోటు దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు రంజీలు, విజయ్ హజారేలు, ముస్తాక్ అలీ టోర్నీల కంటే పెద్ద వేదిక భారత యువ ఆటగాళ్లకు దొరికింది. దాని పేరు ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్లుప్తంగా చెప్పాలంటే ఐపీఎల్.
ఐపీఎల్ ద్వారా చాలా మంది యువ క్రికెటర్లు భారత జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. అయితే ఇలా వచ్చినవాళ్లలో మెరుగ్గా రాణించినవాళ్లే చివరిదాకా ఉంటున్నారు. ఫామ్ లేకపోయినా.. వరుసగా మ్యాచుల్లో విఫలమైనా తిరిగి బ్యాక్ టు పెవిలియనే.
అయితే ఐపీఎల్ లోని ఓ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు మాత్రం భారత జట్టు తరఫున టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నారు. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. భారత జట్టులోకి వస్తున్న ప్రతి ఆటగాడు తొలి టెస్టులో అదిరిపోయే గణాంకాలు నమోదుచేస్తున్నారు. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్..
శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీ షా, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్.. వీళ్లంతా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లే కావడం విశేషం.
శిఖర్ ధావన్.. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేసిన ధావన్ ఆ మ్యాచ్ లో ఇరగదీశాడు. తొలి మ్యాచ్ లోనే అతడు 187 పరుగులతో కదం తొక్కాడు.
రవిచంద్రన్ అశ్విన్.. 2011లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో భారత జట్టులోకి వచ్చిన ఈ ఆఫ్ స్పిన్నర్ తొలి టెస్టులోనే ఏకంగా తొమ్మిది వికెట్లు తీశాడు.
రిషభ్ పంత్.. 2018లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ పంత్ తాను ఎదుర్కున్న తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో ఇలా తొలి బంతికే సిక్సర్ కొట్టిన ఫస్ట్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే.
అక్షర్ పటేల్.. ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన పటేల్ తొలి మ్యాచ్ లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు.
పృథ్వీ షా.. వెస్టిండీస్ తో 2018 లో జరిగిన తొలి టెస్టు లో ఆడిన షా ఆ మ్యాచులో134 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అతడిని మ్యన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది.
శ్రేయస్ అయ్యర్.. ఇక తాజాగా అయ్యర్ కూడా అదిరిపోయే ఆరంభం చేశాడు. కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగతున్న తొలి టెస్టులో అరంగ్రేటం చేసిన అయ్యర్.. 75 పరుగులతో నాటౌట్ గా నిలవడమే గాక సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు.
విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెరీర్ లో తొలి సారి టెస్టు అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ పోరాట పటిమ అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అయ్యర్.. తొలి టెస్టులోనే కష్టాల్లో ఉన్న భారత్ ను ఆదుకున్నాడు.