- Home
- Sports
- Cricket
- IPL 2022: భారత్ కు గతంలో అలాంటి పేసర్ లేడు.. కానీ..! సన్ రైజర్స్ బౌలర్ పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2022: భారత్ కు గతంలో అలాంటి పేసర్ లేడు.. కానీ..! సన్ రైజర్స్ బౌలర్ పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL 2022: ఐపీఎల్-2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న కాశ్మీర్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ పై దిగ్గజ క్రికెటర్, భారత్ కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు.

మెరుగైన ప్రదర్శనలతో అందరితో శభాష్ అనిపించుకుంటున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కంట పడ్డాడు. నిలకడైన స్పీడ్ తో బౌలింగ్ చేస్తున్న ఇలాంటి ఆటగాడు దొరకడం దేశం చేసుకున్న అదృష్టమని కొనియాడాడు.
గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘పేస్ అంత ముఖ్యం కాదు. కానీ నిలకడగా మంచి పేస్ తో స్థిరంగా బౌలింగ్ చేయడమంటే మాములు విషయం కాదు. ఒక్క మ్యాచ్ లోనో రెండు మ్యాచుల్లోనో 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరితే ఓకే..
కానీ ఏకంగా కొంతకాలంగా అదే వేగంతో బంతులు వేయడమంటే నిజంగా ఆశ్చర్యకరమే. నిజంగా చెప్పాలంటే అది గ్రేట్ అచీవ్మెంట్. ఇండియాకు గతంలో అంత వేగంతో విసిరే పేసర్లు లేరు.
కానీ ఈ పోటీ ప్రపంచం కారణంగా యువకులు ఆ వేగంతో పాటు ఖచ్చితత్వంతో బౌలింగ్ వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ విషయంలో మనం ఐపీఎల్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి...’ అని కపిల్ దేవ్ తెలిపాడు.
కపిల్ దేవ్ కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా మాలిక్ బౌలింగ్ పై మనసు పారేసుకున్న విషయం తెలిసిందే. అతడు త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని పైన పేర్కొన్న లెజెండ్లంతా ఆశించారు.
గత సీజన్ లో నటరాజన్ కు గాయం కావడంతో నెట్ బౌలర్ నుంచి మెయిన్ బౌలర్ గా ప్రమోట్ అయిన ఉమ్రాన్.. ఈ ఏడాది ఆరు మ్యాచులాడి 9 వికెట్లు తీసుకున్నాడు. అతడు ఆడిన ప్రతి మ్యాచ్ లో 150 కిలోమీటర్లకు తగ్గకుండా బంతులు వేస్తున్నాడు.
ఆరు మ్యాచుల్లో కూడా ఫాస్టెస్ట్ డెలివరీ అతడిడే. అయితే వేగం తో పాటే ఇప్పుడిప్పుడే తన బౌలింగ్ లో వైవిధ్యం కూడా నేర్చుకుంటున్న ఉమ్రాన్.. లైన్ అండ్ లెంగ్త్ మీద కాస్త దృష్టి సారిస్తే భారత్ కు నిఖార్సైన పేస్ బౌలర్ దొరికినట్టే..
ఐపీఎల్ లో వరుసగా అదరగొట్టే ప్రదర్శనలతో దుమ్మురేపుతున్న ఉమ్రాన్.. త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ జట్టు జాతీయ సెలెక్షన్ కమిటీ కన్ను కూడా ఉమ్రాన్ మీద పడింది. జూన్ లో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ లో అతడిని ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.