- Home
- Sports
- Cricket
- నలుగురు తప్పించి, పూజారాకి మాత్రమే ఛాన్స్... సాహా, ఇషాంత్ శర్మ కెరీర్ ముగిసినట్టేనా...
నలుగురు తప్పించి, పూజారాకి మాత్రమే ఛాన్స్... సాహా, ఇషాంత్ శర్మ కెరీర్ ముగిసినట్టేనా...
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో భారత జట్టు తర్వాతి సిరీస్లకు రంగం సిద్ధమవుతోంది. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్తో పాటు ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టుకి జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే టెస్టు టీమ్కి ఎంపిక చేసిన జట్టులో మయాంక్ అగర్వాల్తో పాటు వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మల పేర్లు కనిపించకపోవడం విశేషం...

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మలకు చోటు ఇవ్వలేదు సెలక్టర్లు...
ఈ మధ్యకాలంలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న వీరంతా రంజీ ట్రోఫీలో పాల్గొని, ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా కోరింది. అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా రంజీ మ్యాచుల్లో ఆడగా... సాహా వ్యక్తిగత కారణాలతో ఈ రంజీ సీజన్కి దూరంగా ఉన్నాడు...
రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలతో పాటు కౌంటీ ఛాంపియన్షిప్లో రెండు డబుల్ సెంచరీలు, మరో రెండు శతకాలతో దుమ్మురేపిన ఛతేశ్వర్ పూజారాకి తిరిగి భారత జట్టులో చోటు దక్కింది...
అయితే 100కి పైగా టెస్టులు ఆడిన అనుభవం ఉన్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఈ టెస్టులో చోటు దక్కకపోవడం విశేషం. 33 ఏళ్ల ఇషాంత్ శర్మ, ఆఖరిగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పాల్గొన్నాడు... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడం కష్టమనే చెప్పాలి...
Wriddhiman Saha
అలాగే రంజీ ట్రోఫీల్లో పాల్గొనని వృద్ధిమాన్ సాహాకి మరోసారి మొండిచేయి చూపించారు సెలక్టర్లు. శ్రీలంకతో సిరీస్కి తనని ఎంపిక చేయని సమయంలో సాహా, సెలక్టర్లపై చేసిన కామెంట్లే... ఇప్పుడు అతనికి జట్టులో చోటు దక్కకపోవడానికి కారణం కూడా కావచ్చు...
Wriddhiman Saha
బెంగాల్ క్రికెట్ బోర్డు అధికారులతోనూ గొడవ పెట్టుకున్న సాహా, 37 ఏళ్ల వయసులో వేరే టీమ్ తరుపున ఆడి ఫామ్ నిరూపించుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యమే...
వృద్ధిమాన్ సాహాతో పాటు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, 4 సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్కి కూడా ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టుకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం విశేషం...
ఆస్ట్రేలియా టూర్లో, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లో భారత జట్టుకి ప్రధాన ఓపెనర్గా ఎంపికైన మయాంక్ అగర్వాల్... ఆసీస్ టూర్లో శుబ్మన్ గిల్ కారణంగా, ఇంగ్లాండ్ టూర్లో కెఎల్ రాహుల్ కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు... ఎప్పుడు పోటీపెరగడంతో ఏకంగా జట్టులోనే స్థానం దక్కించుకోలేకపోయాడు.
శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో భారీ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్, ఆ తర్వాత కొద్దిరోజులకే జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. శుబ్మన్ గిల్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టులో ఓపెనర్లుగా అవకాశం దక్కడంతో మయాంక్ అగర్వాల్ చోటు కోల్పోవాల్సి వచ్చింది...