INDvsAUS: రెండు టెస్టు మ్యాచులకి దూరం కానున్న విరాట్ కోహ్లీ... కారణం ఇదే...
IPL 2020 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు, ఫైనల్ ఫైట్లో ముంబైతో తలబడుతుంది. అయితే తన జట్టును ఐపీఎల్ ఛాంపియన్గా నిలపలేకపోతున్న భారత సారథి విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా సీరస్లో రెండు టెస్టు మ్యాచులకు దూరం కాబోతున్నట్టు సమాచారం.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే... వీరికి వచ్చే జనవరిలో బిడ్డ పుట్టబోతోంది...
ఐపీఎల్లో దుబాయ్ చేరిన విరాట్ కోహ్లీ, తన వెంటే సతీమణి అనుష్క శర్మను కూడా తీసుకెళ్లాడు... ఆర్సీబీ ఆడిన ప్రతీ మ్యాచ్కి హాజరై భర్తను ఉత్సాహపరిచింది అనుష్క.
నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా సిరీస్కి కూడా అనుష్క శర్మతో పాటు వెళ్లాలని భావించాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
అయితే బయో బబుల్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న సమయంలో ఆస్ట్రేలియాకి అనుష్క శర్మను తీసుకెళ్లి, ఆమెను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని కోహ్లీ భావించాడట.
దాంతో ఆసీస్ టూర్కి ఒంటరిగానే బయలుదేరనున్నాడు విరాట్ కోహ్లీ. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన క్వారంటైన్లోకి కూడా వెళ్లిపోయాడు కోహ్లీ....
నవంబర్ 27న వన్డే సిరీస్తో మొదలయ్యే ఆసీస్ టూర్లో డిసెంబర్ 17 నుంచి నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ మొదలవుతుంది...
జనవరి 7న మూడో టెస్టు మ్యాచ్, జనవరి 15న చివరి టెస్టు మ్యాచ్ జరగనున్నాయి. ఈ సమయంలోనే అనుష్క డెలివరీ ఉండడంతో విరాట్ కోహ్లీ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశం బయలుదేరి రానున్నాడని సమాచారం.
అయితే దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం అయితే రాలేదు. మొదటి రెండు టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన ఆధారంగా విరాట్ కోహ్లీ నిర్ణయం మారిపోవచ్చని కూడా అంచనా.
ధోనీ కూడా తన కూతురిని పుట్టిన నెల రోజుల తర్వాతే చూసుకున్నాడు. ఆ సమయంలో ధోనీ 2015 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా లోనే ఉన్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్న పరిస్థితి అంత కీలకమైనదేమీ కాదు. జరగబోయేది ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాబట్టి ఆటగాళ్ల వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ.
బయో బబుల్ దాటి స్వదేశానికి వస్తే... మళ్లీ ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత క్వారంటైన్లో 6 నుంచి 14 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 30న ముగిసే రెండో టెస్టు మ్యాచ్ తర్వాత స్వదేశానికి వచ్చేయనున్నాడు విరాట్ కోహ్లీ.
ఆసీస్ టూర్కి రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా టెస్టు జట్టును టెస్ట్ వైస్ కెప్టెన్ అజింకా రహానే నడిపించబోతున్నాడు.