రచ్చ మొదలైంది... రోహిత్ను కెప్టెన్గా చేయాల్సిందే... కోచ్ రవిశాస్త్రిని పీకేయండి...
INDvAUS: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో 2-0 తేడాతో ఓడి, మొదటి సిరీస్ను కోల్పోయింది టీమిండియా. రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు ఘోరంగా విఫలం కాగా బ్యాట్స్మెన్ కాస్తో కూస్తో రాణించడంతో లక్ష్యచేధనలో 300+ స్కోరు చేయగలిగింది టీమిండియా. దీనిపై ఎప్పటిలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత హెడ్ కోచ్ రవిశాస్త్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ వెంటనే తీసి పాడేయాలంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్.
2020 క్రికెట్ సీజన్పై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. లాక్డౌన్ కారణంగా దేశవాళీ క్రికెట్కి కూడా ఏడు నెలల బ్రేక్ వచ్చింది. దీంతో ఐపీఎల్ 2020 ప్రదర్శన ఆధారంగా ఆసీస్ టూర్కి భారత జట్టును ఎంపిక చేశారు సెలక్టర్లు.
భారత జట్టు ఎంపికలో ఎలాంటి రిస్క్ తీసుకోని సెలక్టర్లు, నటరాజన్ మినహా కొత్త ప్లేయర్లకు టీమ్లో ప్లేస్ ఇవ్వలేదు. అయితే ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా జట్టును ఎంపిక చేసినప్పుడు కెప్టెన్ని మాత్రం వేరేగా ఎంచుకున్నాడని విమర్శిస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్.
ఐపీఎల్ 2020 సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. రోహిత్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.
ఐపీఎల్ ప్రదర్శనే జట్టు ఎంపికకి కొలమానం అయితే రోహిత్ శర్మను లేదా ఢిల్లీ క్యాపిటిల్స్ను ఫైనల్కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్కి భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా ఐదు వన్డేల్లో ఓడింది. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి రెండు వన్డేల్లో ఓడింది.
మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నన్ని రోజులు టీమిండియాను నడిపించిన విరాట్ కోహ్లీ, మాహీ లేని టీమ్ను నడిపించడంలో ఫెయిల్ అవుతున్నాడని విమర్శలు వస్తున్నాయి.
అయితే ధోనీ లేని టెస్టు జట్టును నెం.1 టీమ్గా మార్చిన విరాట్ కోహ్లీ, మాహీ లేకుండా కెప్టెన్సీ చేయలేడని వాదించడం అర్థం లేని వాదన అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్లో ఆసీస్ టాపార్డర్ మొత్తం అద్భుతంగా రాణించింది. స్టీవ్ స్మిత్ రెండు సెంచరీలు చేయగా, ఆరోన్ ఫించ్, మ్యాక్స్వెల్, వార్నర్ అందరూ రాణించారు...
ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రాను సరిగా ఉపయోగించుకోవడంలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు క్రికెట్ అభిమానులు.
మొదటి వన్డేలో ఘోరంగా విఫలమైన నవ్దీప్ సైనీని మళ్లీ రెండో వన్డేలో కొనసాగించడం, తుదిజట్టు ఎంపికలో విరాట్ చేస్తున్న తప్పులే ఆస్ట్రేలియాకి అడ్వాంటేజ్గా మారుతున్నాయని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
భారత జట్టు వైఫల్యం విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ రవిశాస్త్రిపైన కూడా పడింది. బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి ధారాళంగా పరుగులు ఇస్తుంటే, కోచ్ రవిశాస్త్రి నిద్రపోతున్నాడా? మందు కొట్టి పడుకున్నాడా? అంటూ ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
క్రమశిక్షణ విషయంలో ఎంతో కఠినంగా వ్యవహారించే అనిల్ కుంబ్లేని కోచ్గా తప్పించి, రవిశాస్త్రికి కోచ్ బాధ్యతలు అప్పగిస్తే జట్టు ప్రదర్శన ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పటికైనా భారత జట్టు ప్రదర్శన మెరుగవ్వాలంటే భారత కెప్టెన్ను, హెడ్ కోచ్ను వెంటనే మార్చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. మూడో వన్డేలో కూడా టీమిండియా ఓడితే ఈ ట్రోల్ మరింత పెరిగే అవకాశం ఉంది.