INDvsAUS: కోహ్లీ హాఫ్ సెంచరీ... హార్ధిక్ పాండ్యా, జడేజా మెరుపులు... ఆస్ట్రేలియా ముందు మంచి టార్గెట్...
INDvAUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వలేకపోయింది. ఆసీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు విరాట్ కోహ్లీ మినహా భారత టాపార్డర్ ఫెయిల్ కావడంతో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడి ఆరో వికెట్కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో 374, 389 వంటి భారీ స్కోర్లు చేసిన ఆస్ట్రేలియాకి ఇది ఈజీ టార్గెట్ అవుతుందనే అంచనా వేస్తున్నారు అభిమానులు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా.
దూకుడుగా ఆడే మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్మన్ గిల్తో ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్... కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు.
మొదటి రెండు వన్డేల్లో మొదటి వికెట్కి 50+ భాగస్వామ్యం రాగా... మూడో వన్డేలో 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. హజల్వుడ్ వేసిన మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయిన ధావన్, కొత్త బౌలర్ అబ్బాట్ బౌలింగ్లో అగర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత గిల్, కోహ్లీ కలిసి రెండో వికెట్కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 33 పరుగులు చేసిన గిల్, అగర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
టూ డౌన్లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి జంపా బౌలింగ్లో వెనుదిరిగాడు...
కెఎల్ రాహుల్ 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా...
విరాట్ కోహ్లీ 64 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 12 వేల మైలురాయిని చేరుకున్న కోహ్లీకి ఇది 60వ హాఫ్ సెంచరీ.
78 బంతుల్లో 5 ఫోర్లతో 63 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ... మరోసారి హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
2008లో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా 11 ఏళ్లుగా ప్రతీ యేటా సెంచరీలు నమోదుచేస్తున్న విరాట్ కోహ్లీ, ఈ ఏడాది ఆ మార్కు అందుకోలేకపోయాడు.
2020 సీజన్లో 9 వన్డే మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ... ఒక్క సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు. కరోనా వైరస్ కారణంగా క్రికెట్కి ఏడు నెలల పాటు బ్రేక్ పడడం కోహ్లీ సెంచరీ మిస్ కావడం కారణం.
2017, 2018 ఇయర్స్లో ఆరేసి సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 2019లో ఐదు శతకాలు బాదాడు. 2009లో మొదటి సెంచరీ చేసిన విరాట్ ఆ తర్వాత ప్రతీయేటా కనీసం రెండు అంతకంటే ఎక్కువ శతకాలు నమోదుచేస్తూ వచ్చాడు.
2020లో ఏడాదిలో ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విరాట్ కోహ్లీ చేసిన 89 పరుగులే అతని అత్యధిక స్కోరు. 11 ఏళ్ల పాటు వరుసగా సెంచరీలు నమోదుచేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (19 ఏళ్లు), నాథన్ అస్టలే (12 ఏళ్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు.
వరుసగా నాలుగు మ్యాచుల్లో హజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ... వరుసగా నాలుగు వన్డేల్లో విరాట్ను అవుట్ చేసిన మొదటి బౌలర్గా నిలిచాడు హజల్వుడ్.
విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్కి శతాధిక భాగస్వామ్యం నమోదుచేశాడు హార్ధిక్ పాండ్యా.
హార్ధిక్ పాండ్యా 76 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్తో 92 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఆరో వికెట్కి ఈ ఇద్దరూ 108 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రవీంద్ర జడేజా మొదట నెమ్మదిగా ఆడినా తర్వాత బౌండరీలతో విరుచుకుపడి 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏడు బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టాడు జడేజా.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆస్టన్ అగర్కి రెండు వికెట్లు దక్కగా హజల్వుడ్, అబ్బాట్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ తీశారు.