నేను వచ్చినా ఆడించరు, వచ్చి ఏం చేయాలి... ఐపీఎల్ 2021పై డేవిడ్ వార్నర్ షాకింగ్ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు డేవిడ్ వార్నర్ రావడం లేదని స్పష్టం అయిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మిగిలిన మ్యాచులకు ఆస్ట్రేలియా ప్లేయర్లను పంపేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చినా, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రవర్తించిన తీరుతో డేవిడ్ భాయ్ చాలా బాధపడ్డట్టు తాజా ట్వీట్లతో స్పష్టంగా అర్థం అవుతోంది.
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్ను కెప్టెన్గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. 2016లో ఎస్ఆర్హెచ్కి టైటిల్ అందించి, ఐదు సీజన్లలో నాలుగు సార్లు ఫ్లేఆఫ్ చేర్చిన వార్నర్ భాయ్ని పక్కనబెట్టి, కేన్ విలియంసన్కి కెప్టెన్సీ అప్పగించింది...
కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2021 సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో డేవిడ్ వార్నర్కి తుది జట్టులో కూడా చోటు దక్కలేదు. దాంతో అతను డగౌట్లో బ్యాట్లు అందిస్తూ, డ్రింక్స్ మోస్తూ కనిపించాడు.
ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కేసుల కారణంగా నిరవధిక వాయిదా పడడం జరిగిపోయింది. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్గా డేవిడ్ వార్నర్, తాజాగా ఓ అభిమాని ‘మీరు ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు ఆడతారా’ అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు...
‘‘తొలుత ఆ అభిమానికి ఇంకా కన్ఫార్మ్ కాలేదని, చెప్పలేనని రిప్లై ఇచ్చిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత... ‘ఒకవేళ నేను వచ్చినా, నన్ను జట్టులో సెలక్ట్ చేయరు. కాబట్టి జట్టును ఛీర్ చేయడం అవసరం....’’ అంటూ సమాధానం ఇచ్చాడు.
ఇన్డైరెక్ట్గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన పట్ల ప్రవర్తించిన తీరుపై డేవిడ్ వార్నర్ చాలా హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున గత ఆరు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్. మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు.
గత సీజన్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే 600+ స్కోరు చేసిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2021 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్గా నిలిచాడు. సన్రైజర్స్లో ఎవ్వరూ 400+ స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం.
మొదటి మూడు మ్యాచుల్లో పర్ఫామెన్స్ సరిగా లేకపోవడంతో నాలుగో మ్యాచ్లో మనీశ్ పాండేని తప్పించింది సన్రైజర్స్. అతని స్థానంలో వచ్చిన విరాట్ సింగ్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేశాడు.
‘మనీశ్ పాండేని జట్టు నుంచి తప్పించడం నాకూ ఇష్టం లేదు, కానీ మేనేజ్మెంట్ ఎందుకు అలా ప్రవర్తించిందో నాకు తెలీదు’ అంటూ డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలే, అతని కెప్టెన్సీ పోవడానికి కారణమయ్యాయి. పంజాబ్ కింగ్స్తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్లో వార్నర్ స్లోగా బ్యాటింగ్ చేయడం, సూపర్ ఓవర్లో షార్ట్ రన్ తీయడంతో పెద్ద చర్చకు దారి తీసింది.
దీన్ని సరైన సమయంగా భావించిన సన్రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతి మ్యాచ్లో తుది జట్టులో కూడా వార్నర్కి చోటు దక్కలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్ 60 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది.
సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ను తన సొంత కుటుంబంగా భావించే డేవిడ్ వార్నర్, ఆరెంజ్ ఆర్మీతో ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకున్నాడు. అలాంటి జట్టు అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం, జట్టు నుంచి పక్కనబెట్టడంతో వార్నర్ భాయ్ మనసు విరిగిపోయిందని తెలుస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు... ‘బ్రింగ్ బ్యాక్ వార్నర్’, ‘నో వార్నర్, నో ఎస్ఆర్హెచ్’ అంటూ హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ చేసి, అతనిపై అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఐపీఎల్ వాయిదా పడింది.
కెప్టెన్గా నియమించిన కేన్ విలియంసన్, స్టార్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో... ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని తేలిపోయింది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా రాకపోతే సన్రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్గా భువీ వ్యవరించే అవకాశం ఉంది. అయితే స్టార్లు, అసలైన పర్ఫామర్లు లేని ఆరెంజ్ ఆర్మీ గల్లీ స్థాయి పర్ఫామెన్స్ కూడా ఇవ్వడం కష్టమే.