టాస్ గెలిస్తే అదే తీసుకుంటాం, వాళ్ల వీక్నెస్లు తెలుసు... న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం అటు న్యూజిలాండ్, ఇటు టీమిండియా అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 15 మందితో కూడిన జట్లను ప్రకటించిన ఇరు జట్లు, టైటిల్పై కన్నేశాయి. అయితే టీమిండియా బ్యాట్స్మెన్ వీక్నెస్లు తమకు బాగా తెలుసంటున్నాడు న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్.
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మేం ఇంగ్లాండ్లో రెండు టెస్టులు ఆడాం. వాటిల్లో ఒకటి గెలిచాం. ఆ ఇంపాక్ట్, ఫైనల్ మీద బాగా ఉంటుంది...
టీమిండియా బౌలింగ్ అటాక్ బాగుంది. నా ఉద్దేశం ప్రకారం వాళ్లు ఫైనల్ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలో దిగారు. న్యూజిలాండ్ మాత్రం ఐదుగురు సీమర్లను ఆడించే అవకాశం ఉంది...
టాస్ గెలిస్తే న్యూజిలాండ్ కచ్ఛితంగా తొలుత బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే భారత బ్యాట్స్మెన్ వీక్నెస్లు, న్యూజిలాండ్ బౌలర్లకు బాగా తెలుసు...
కాబట్టి సాధ్యమైనంత తక్కువ స్కోరుకి టీమిండియాని ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం... కాబట్టి నాకు తెలిసి ఫైనల్ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి బౌలింగ్ సలహాదారుడిగా వ్యవహారించిన షేన్ బాండ్... ఆ సమయంలో రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్డ్ మధ్య జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు...
‘ఐపీఎల్ 2021 సమయంలో ట్రెంట్ బౌల్ట్, నెట్స్లో రోహిత్ శర్మ కాళ్లను గురి పెడుతూ బౌలింగ్ చేశాడు. చాలాసార్లు అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు కూడా. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఇదే చేస్తానని ట్రెంట్ బౌల్ట్, రోహిత్ శర్మతో చెప్పాడు... వారిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు షేన్ బాండ్.
టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటామని షేన్ బాండ్ చేసిన వ్యాఖ్యల్లో ఏదో వ్యూహం ఉందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. సౌంతిప్టన్ పిచ్ పేస్కి చక్కగా అనుకూలిస్తుంది. అయితే రోజులు గడిచేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం మొదలవుతుంది.
బౌలింగ్ ఎంచుకుంటామని చెబితే భారత జట్టు, వారి వ్యూహ్యాన్ని బెడిసి కొట్టాలనే ఉద్దేశంతో టాస్ గెలిస్తే, తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపొచ్చు. ఇలా జరిగితే రెండో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని చేధించడం అసాధ్యమవుతుందని, ఇలా ఓపెన్గా చెప్పడంలో ఉన్న అసలు రహస్యం ఇదేనని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్.
అయితే వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ మాత్రం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత జట్టు చరిత్ర క్రియేట్ చేయబోతుందని అంచనా వేశాడు... ‘ఆస్ట్రేలియాలో టీమిండియా గాయాలతో ఆడి అద్భుతం చేసింది. ఇప్పుడు వాళ్లు సాధించలేనిదంటూ ఏదీ లేదు’ అంటూ కామెంట్ చేశాడు ఇయాన్ బిషప్.
అయితే ఇప్పటికే ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్, స్వదేశంలో వారినే మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఇచ్చే ఉత్సాహం, ఫైనల్లో కనిపించే అవకాశం ఉంది.