డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే విరాట్ కోహ్లీపై... ఓడితే రోహిత్ శర్మపై! ఏది జరిగినా ట్రోల్స్ మాత్రం కామన్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబర్చింది. టాస్ గెలిచి ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించిన టీమిండియా నిర్ణయం తప్పని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో టీమిండియాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. దీనికి ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటిదాకా 8 ఫైనల్స్ (ఐపీఎల్తో సహా) ఆడితే ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు..
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్కి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్ పద్ధతిని ఎంచుకున్న టీమిండియా, స్పిన్ ఆల్రౌండర్గా జడ్డూకి తుది జట్టులో చోటు ఇచ్చింది..
మొదటి రోజు ఈ ఎత్తుగడ పెద్దగా ఫలించినట్టు అనిపించలేదు. భారత బౌలర్లు రోజంతా బౌలింగ్ చేసినా 3 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్లో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పుడు అశ్విన్ని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టడం చాలా పెద్ద తప్పిదం అంటున్నారు విశ్లేషకులు..
దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 టోర్నీలో టీమిండియా విఫలమైతే, అశ్విన్ని పక్కనబెట్టినందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు... అదీకాకుండా 2021 ఇంగ్లాండ్ పర్యటనలో అశ్విన్ లేకుండా నాలుగింట్లో 2 టెస్టులు గెలిచాడు విరాట్ కోహ్లీ...
వర్షం కారణంగా డ్రా అయిన మ్యాచ్లో కూడా టీమిండియా ఆధిపత్యమే సాగింది. దీంతో అశ్విన్ లేకుండా ఇంగ్లాండ్లో ఆడించిన టీమ్తో గెలవలేకపోయినందుకు రోహిత్ శర్మ ట్రోల్స్ ఎదుర్కోకతప్పదు..
ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే, గత సీజన్కి కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ట్రోల్స్ ఎదుర్కోకతప్పదు. 2017 నుంచి టీమిండియా సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 2021 టీ20 వరల్డ్ కప్ వరకూ సారథిగా ఉన్నా... ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయాడు.
దీంతో డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ ఓడిపోతే రోహిత్ శర్మను ట్రోల్ చేసేందుకు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే... ఈసారి టీమిండియా, ఐసీసీ టైటిల్ సాధిస్తే విరాట్ కెప్టెన్సీని ట్రోల్ చేసేందుకు రోహిత్ శర్మ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు..