భారత్ లో నాకు శాపం తగిలింది : ఐపీఎల్ లో ఆడిన ఆసీస్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
IPL 2022: ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన మిచెల్ మార్ష్.. ఆడింది తక్కువ మ్యాచులే అయినా తన మార్కును చూపించాడు. అయితే భారత్ లో తనకు శాపం తగిలిందని అతడు సంచలన కామెంట్స్ చేశాడు.

భారత్ లో తనకు శాపం తగిలిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ అన్నాడు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా తాను గాయపడుతున్నానని చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై అతడు తాజాగా మాట్లాడుతూ.. ‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే (పాకిస్తాన్ లో) గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కోవిడ్ వచ్చింది..
అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా. ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. కానీ నేను కోవిడ్ నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి ఢిల్లీ జట్టుతో చేరి మంచి ప్రదర్శనలు చేశా. అక్కడున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను..’ అని తెలిపాడు.
ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ పై మార్ష్ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. ‘నేను జట్టులో చేరినప్పుడు అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు. ఆటలో అతడు ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు తెలుసు. అయితే అతడితో కలిసి చేసిన ప్రయాణంలో పాంటింగ్ తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది.
నేను ఢిల్లీ జట్టుకు ఎంత ముఖ్యమైన ఆటగాడినో పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నన్ను మోటివేట్ చేసేవాడు. నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెంచేలా దోహదం చేసేవాడు..’ అని మార్ష్ చెప్పాడు.
2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు. ఇక తాజా సీజన్ లో 8 మ్యాచులాడి.. 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం మార్ష్.. లంకలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతడు సభ్యుడు. జూన్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది.