నన్ను టెస్టులలోకి తీసుకోరు.. ఇంకా రంజీలు ఆడి ఏం లాభం: ధావన్ సంచలన వ్యాఖ్యలు
2018 తర్వాత గబ్బర్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేదు. దేశవాళీలో కూడా ధావన్.. 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. తాజాగా అతడు రంజీలలో ఆడటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది వరకు వన్డేలలో రెగ్యురల్ ఓపెనర్ గా ఉన్న ధావన్.. న్యూజిలాండ్ తో పాటు బంగ్లాదేశ్ పర్యటనలలో దారుణంగా విఫలమవడంతో సెలక్టర్లు అతడిని పక్కనబెట్టారు.
టీ20లలో ధావన్ ను పరిగణనలోకి తీసుకోని సెలక్టర్లు.. వన్డేలకు మాత్రమే అతడిని ఆడించేవారు. టెస్టులలో మంచి రికార్డు ఉన్నా ధావన్ ను ఐదేండ్ల క్రితమే టీమ్ నుంచి తప్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ తిరిగి భారత్ తరఫున ఆడటమే అద్భుతమంటే ఇక టెస్టులలోకి చోటు సంపాదిండచం అతిశయోక్తే అవుతుంది. ధావన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. తాను అందుకే రంజీలు కూడా ఆడటం లేదని చెప్పాడు.
తాజాగా అతడు ఓ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘నాకు వాటి గురించి (రంజీలు ఆడటంపై) పెద్దగా ఆలోచన లేదు. నా టెస్టు కెరీర్ గురించి నాకు తెలుసు. గడిచిన నాలుగేండ్లుగా నేను టెస్టు జట్టులో లేను. వయసు కూడా ఓ ముఖ్య కారణం కావచ్చు. మిగతావారితో పోలిస్తే ఓ క్రీడాకారుడి కెరీర్ భిన్నంగా ఉంటుంది. సెలక్టర్లు కూడా యువ ఆటగాళ్ల మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. నా మీద కాదు..
నేను టెస్టులు ఆడనని తెలిసినప్పుడు ఇంకా నేను అవి (రంజీలు) ఆడి ఏం ప్రయోజనం..? అందుకే నా బాడీకి రెస్ట్ ఇస్తున్నా. నిత్యం ఫ్రెష్ గా ఉండేందుకు ఇది నాకు తోడ్పడుతుంది. అయితే రంజీలు ఆడటం లేదు గానీ దేశవాళీలో వన్డేలు, టీ20 మ్యాచ్ లు ఆడుతూనే ఉన్నా...’అని చెప్పాడు.
2013లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ధావన్ మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో ధావన్.. 174 బంతుల్లోనే 187 పరుగులు చేసి దుమ్ముదులిపాడు. ఆ తర్వాత నాలుగేండ్లపాటు ధావన్ టెస్టు జట్టులో కొనసాగాడు. అయితే 2017 తర్వాత ఆసియా వెలుపల జరిగే టోర్నీలకు మాత్రం ధావన్ ను సెలక్టర్లు పక్కనబెట్టారు.
ఇక 2018 తర్వాత ధావన్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేదు. దేశవాళీలో కూడా గబ్బర్.. 2019లో చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత ధావన్ పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్ మీదే దృష్టి సారించాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో ధావన్.. 34 టెస్టులలో 2,315 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.