- Home
- Sports
- Cricket
- చేతికి కుట్లు.. పెయిన్ కిల్లర్స్ తీసుకుని మరీ ఐపీఎల్ ఆడాను : లక్నో పేసర్ షాకింగ్ కామెంట్స్
చేతికి కుట్లు.. పెయిన్ కిల్లర్స్ తీసుకుని మరీ ఐపీఎల్ ఆడాను : లక్నో పేసర్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా యువ పేసర్, ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవేశ్ ఖాన్.. ఇటీవలే ముగిసిన సీజన్ కు ముందు పూర్తిస్థాయిలో ఫిట్ గా లేకున్నా పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ బరిలోకి దిగాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.

ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవేశ్ మాట్లాడుతూ.. ‘వాస్తవానికి రంజీ ట్రోఫీ సందర్భంగానే నాకు గాయమైంది. ఐపీఎల్ లో ఆడతానో లేదోనని అనుకున్నా. చేతికి కుట్లు ఉన్నాయి. ఆ సమయంలో నేను ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్స్ తీసుకుని మరీ బరిలోకి దిగాను.
Image credit: PTI
గేమ్ పట్ల నాకున్న డెడికేషన్ ను చూసి టీమ్ లో అందూరూ నన్ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా లక్నో హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అయితే నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నొప్పి ఉన్నా ఆడాలన్న నా తపన చూసి ఆయన ముచ్చటపడ్డారు. నా అటిట్యూడ్ ఆయనకు నచ్చింది. టీమ్ కంటే ఏది ఎక్కువ కాదని అది నేను నిరూపిస్తున్నానని నాతో అన్నారు..
ఒక ఫాస్ట్ బౌలర్ ఎప్పుడూ తాను ఆడే టీమ్ కు తన బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటాడు. కానీ ఇది పైకి కనబడేంత ఈజీ కాదు. డైట్ ను క్రమం తప్పకుండా ఫాలో కావాలి. ప్రాపర్ షెడ్యూల్ ఫాలో కావాలి. రోజుకు 8-9 గంటలు పడుకోవాలి. కచ్చితమైన ప్రాక్టీస్ ఉండాలి. ఇవన్నీ చెప్పడానికి, చూడటానికి చాలా ఈజీగా ఉంటాయి. కానీ పాటించడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్నవి..’అని చెప్పుకొచ్చాడు.
కాగా గడిచిన రెండు సీజన్లుగా లక్నో తరఫున ఆడుతున్న అవేశ్ ఖాన్.. ఈ ఏడాది పెద్దగా రాణించలేకపోయాడు. ఐపీఎల్ - 16 సీజన్ లో అతడు తొమ్మిది మ్యాచ్ లు ఆడి 8 వికెట్లు మాత్రమే తీశాడు. అవేశ్ ఖాన్ ఐపీఎల్ - 2022 లో మెరుగైన ప్రదర్శనలు చేయడంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లయ కోల్పోయి జట్టులో చోటు కూడా కోల్పోయాడు.
Image credit: PTI
ఐపీఎల్-16 లో భాగంగా ఆర్సీబీతో బెంగళూరు వేదికగా జరిగిన ఓ మ్యాచ్ లో ఆ జట్టు నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. చివరి బంతికి అవేశ్ సింగిల్ తీయడంతో లక్నో ఘనవిజయం సాధించింది. అప్పుడు అవేశ్ హెల్మెట్ ను నేలకేసి బాదాడు. దానికి బీసీసీఐ క్రమశిక్షణా ఉల్లంఘన కింద అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత కూడా విధించింది. అవేశ్ తాజాగా ఈ ఘటనపై కూడా స్పందించాడు.
‘ఆ రోజు హెల్మెట్ తీసి బాదడం కాస్త ఓవరే. అలా చేయకుండా ఉండాల్సింది. కానీ అప్పుడు మ్యాచ్ ఉన్న పరిస్థితులో తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లాను. అందుకే గెలవగానే ఒళ్లు తెలియకుండా అలా చేసేశాను.. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఆ రోజు అలా చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది..’ అని చెప్పుకొచ్చాడు అవేశ్..