వాళ్లు వాగుతూనే ఉంటారు.. నేను పట్టించుకోను.. : శుభమన్ గిల్
Shubman Gill: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడిన గిల్.. 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అతడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. సుమారు 18 నెలల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన గిల్.. అంచనాలకు మించి రాణించాడు.
టీమిండియా యువ ఆటగాడు శుభమన్ గిల్ ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ సిరీస్ లో రాణించాడు. ఓపెనర్ గా శిఖర్ ధావన్ తో కలిసి బ్యాటింగ్ చేసిన అతడు.. భారత్ వన్డే సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సుమారు 18 నెలల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన గిల్.. అంచనాలకు మించి రాణించాడు.
తాజాగా గిల్ తనపై వచ్చే విమర్శలు చేసేవారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు వాగుతూనే ఉంటారని, తాను మాత్రం పట్టించుకోనని చెప్పాడు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
తన బ్యాటింగ్, ఫామ్, సగటు గురించి వస్తున్న విమర్శలపై గిల్ మాట్లాడుతూ.. ‘విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. కానీ నేను మాత్రం వాటిని పట్టించుకోను. నా ప్రదర్శన నా జట్టుకు ఏమేరకు ఉపయోగపడిందన్నదే నాకు ముఖ్యం. నా నుంచి కెప్టెన్, జట్టు యాజమాన్యం ఏమనుకుంటున్నదన్నదే నాకు కీలకం తప్ప ఈ విమర్శలను పట్టించుకునే టైమ్ నాకు లేదు..’ అని అన్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడిన గిల్.. 205 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అతడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడో వన్డేలో అతడు 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వన్డేలలో తొలి సెంచరీ చేసుకునే క్రమంలో అతడికి వాతావరణం కూడా అనుకూలించలేదు. వర్షం రావడంతో మ్యాచ్ ను కుదించడంతో అతడు సెంచరీ కోల్పోయాడు.
ఇక విండీస్ టూర్ లో తన ప్రదర్శనపై గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇలాంటి ప్రదర్శనలు మనకు బూస్ట్ ఇస్తాయి. అయితే ఈ ఫామ్ ను కొనసాగించడం ముఖ్యం. జట్టుకోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి..’ అని అన్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో రాణించడంతో అతడు త్వరలో జరుగబోయే జింబాబ్వే టూర్ కూ ఎంపికయ్యాడు. జింబాబ్వే టూర్ లో భారత్ ఆగస్టు 18న తొల వన్డే, 20న రెండో వన్డే, 22న మూడో వన్డే ఆడనుంది. ఈ జట్టుకు కూడా శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు.