IPL Auction 2022: మరోసారి ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ టెస్టు సారథి..? దానికోసమేనంటూ వ్యాఖ్య
Joe Root In IPL: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ కు మరోసారి నిరాశ. యాషెస్ ఓటమి అతడిని ఐపీఎల్ కు రాకుండా బ్రేక్ వేసింది. యాషెస్ కు ముందు ఐపీఎల్ కు రావాలని ప్రణాళికలు వేసుకున్నా...
ఇంతవరకు ఐపీఎల్ లో ఆడని వెలితి వేధిస్తున్న వేళ ఈసారి కచ్చితంగా వేలంలో పాల్గొని ఏదో ఒక జట్టుతో ఆడాలని భావించిన ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ ఆశలు అడియాసలే అయ్యాయి.
ఈసారి కూడా అతడు ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండనున్నాడు. యాషెస్ లో ఇంగ్లాండ్ దారుణ పరాజయం తర్వాత అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2022 ఐపీఎల్ మెగా వేలానికి తాను అందుబాటులో ఉండాలనుకుంటున్నట్టు రూట్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కానీ యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన అతడి సారథ్య పదవికే ఎసరుతెచ్చింది. యాషెస్ ను 0-4తో ఆస్ట్రేలియాకు అప్పగించిన ఇంగ్లాండ్ లో భారీ మార్పులు తప్పవని అనుకుంటున్నారు. కెప్టెన్ రూట్ తో పాటు చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు ఉద్వవాసన తప్పదని ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రూట్.. తన ఐపీఎల్ ఎంట్రీ పై స్పష్టతనిచ్చాడు. యాషెస్ సిరీస్ అనంతరం రూట్ మాట్లాడుతూ.. ‘ఈ జట్టు కోసం చేయాల్సింది చాలా ఉంది. మన దేశం (ఇంగ్లాండ్) లో టెస్టు క్రికెట్ పై నేను చాలా శ్రద్ధ వహిస్తున్నాను. రాబోయే కొన్ని సంవత్సరాలలో మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాను. దానికోసం నేను చేయగలిగినతం త్యాగం చేస్తాను. నా దృష్టంతా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ మీదే ఉంది..’ అని చెప్పాడు.
దీంతో రూట్ ఈసారి కూడా వేలంలో పాల్గొనబోడని చెప్పకనే చెప్పాడు. 2018లో రూట్.. తన పేరును ఐపీఎల్ వేలంలో ఉంచాడు. కానీ అతడిని తీసుకోవడానికి ఏ జట్టు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.
Joe Root
ఇక గతేడాది టెస్టులలో భీకర ఫామ్ తో క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించడంతో ఈసారి వేలంలో అతడికి భారీ ధర దక్కుతుందని ఆశించాడు. కానీ యాషెస్ అతడి ఐపీఎల్ కలల్ని కల్లలు చేసింది.