నాకు ఇష్టమైన బిర్యానీ తినడం తగ్గించా... రహానే మాటలు మరిచిపోలేను... - సిరాజ్
మహమ్మద్ సిరాజ్... ఈ హైదరాబాదీ బౌలర్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతోంది. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి, అబ్బురపరిచాడు సిరాజ్. ఆడుతున్న మూడో టెస్టులోనే బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించిన సిరాజ్... ఏ మాత్రం అనుభవం లేని యంగ్ బౌలర్లతో సంచలన ప్రదర్శన రాబట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం సిరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు...
ఆస్ట్రేలియా టూర్ ఆరంభానికి ముందే మహ్మద్ సిరాజ్ తండ్రి కన్నుమూశారు. అయితే తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉన్న సిరాజ్, భారత జట్టు తరుపున రాణించి ఆయనకి ఘనమైన నివాళి ఇస్తానని ప్రకటించాడు.
మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్గానూ రికార్డు సృష్టించాడు...
‘నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసి మాట్లాడిన మాటలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి. నువ్వు క్రికెట్లో రాణించాలనే నాన్న కోరుకున్నాడని, అక్కడే ఉండి ఆయన కల నిజం చేయాలని అమ్మ చెప్పింది...
ఆ మాటలు విన్నాక నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఒత్తిడికి గురైన ప్రతీసారి తన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెంచాడు కెప్టెన్ అజింకా రహానే...
రహానే ఇచ్చిన ధైర్యం చాలా విలువైనది. అందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెబుతున్నా... నేను ఈ సిరీస్లో తీసిన వికెట్లలో స్మిత్ వికెట్ చాలా స్పెషల్.
నాన్న దీవెనలతోనే ఐదు వికెట్లు తీయగలిగానని అనుకుంటున్నా... నా ఆనందాన్ని మాటల్లో వర్ణించడం వీలుకాదు...
లాక్డౌన్ సమయంలో ఫిట్నెస్ సాధించడానికి ట్రైనర్ సోహమ్ దేశాయ్ చాలా సహకరించారు.... నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం.
కానీ టెస్టులకు అవసరమైన లాంగ్ స్పెల్స్ వేసేందుకు బిర్యానీ తినడం చాలా తగ్గించాను... బుమ్రా లేకపోవడంతో నాపై బాధ్యత పెరిగింది...
అయితే నన్ను నేను సీనియర్ బౌలర్గా ఊహించుకోలేదు... అందుకే కసిగా బౌలింగ్ చేశాను...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్.
రెండో ఇన్నింగ్స్లో 19.5 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్... లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, హజల్వుడ్లను అవుట్ చేసి... 5 వికెట్లు పడగొట్టాడు.