ఆ పని చేసినందుకు ఆర్సీబీకి రుణపడి ఉంటా.. దినేశ్ కార్తీక్ ఎమోషనల్ కామెంట్స్
IPL 2022: ఐపీఎల్-15 లో ఎవరూ ఊహించని ప్రదర్శనలతో తిరిగి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. జట్టులోకి తిరిగిరావడం పై అతడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కామెంటరీ చెబుతున్నాడు ఇంక క్రికెట్ ఏం ఆడతాడు...? అనే స్థాయి నుంచి 36 ఏండ్ల వయసులో మెరుపులు మెరిపించి తిరిగి భారత జట్టులో పునరాగమనం చేశాడు రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఐపీఎల్-15 లో అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టిన అతడిని సౌతాఫ్రికాతో ఆడించే అవకాశమున్నది.
కాగా తాను తిరిగి భారత జట్టులోకి రావడంపై కార్తీక్ స్పందిస్తూ.. ఆర్సీబీకి తాను రుణపడి ఉంటానని తెలిపాడు. తన కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో వేలంలో తనను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు.
కార్తీక్ మాట్లాడుతూ... ‘ఇది నాకు చాలా స్పెషల్ కమ్ బ్యాక్. నేను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే చాలా మంది ఇక నా పని అయిపోయిందని అన్నారు.
కానీ తిరిగి భారత జట్టులోకి రావడానికి ఏం చేశానో.. ఎలా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఈ మధ్య కాలంలో నా జీవితంలో కూడా చాలా ప్రత్యేకమైన విషయాలు జరిగాయి.
ఇక నన్ను నమ్మి జట్టులోకి తీసుకున్నందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రుణపడి ఉంటా. వాళ్లు జట్టులో నా పాత్ర ఏమిటనేదానిమీద స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఆ మేరకు నాకు స్వేచ్ఛనిచ్చారు.. ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు..’ అని తెలిపాడు.
కాగా ఈ సీజన్ లో ఆర్సీబీ గెలిచిన కీలక మ్యాచులలో దినేశ్ కార్తీక్ పాత్ర ఉంది. ఇప్పటివరకు 14 మ్యాచులాడిన కార్తీక్.. 287 పరుగులు చేశాడు. కార్తీక్ వచ్చేదే.. ఫినిషర్ గా. ఆ పాత్రను అతడు ఊహించినదానికంటే ఎక్కువగా పోషించాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్ లో రిషభ్ పంత్ తో పాటు కార్తీక్ ను కూడా ఎంపిక చేసినా పంత్ ను పక్కనెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతడికి విశ్రాంతినిచ్చి.. కార్తీక్ ను ఆడించాలని టీమిండియా భావిస్తున్నది. అక్టోబర్ లో ఆసీస్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ నాటికల్లా ఈ ఇద్దరిని సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తున్నది.