IPL: అతడు రాజ్యం లేని పాలకుడు.. విరాట్ కోహ్లి పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలు బెంగళూరు, పంజాబ్ లకు సారథుల్లేరు. గతంలో విరాట్ కోహ్లి ఆర్సీబీని నడిపించగా.. కెఎల్ రాహుల్ పంజాబ్ కు సారథ్యం వహించాడు. కానీ ఈ సీజన్ లో ఆ జట్లకు సారథుల కోసం వెతుక్కోవాల్సిన పని పడింది. ఈ నేపథ్యంలో చోప్రా స్పందిస్తూ...
భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ గా రాణిస్తున్న ఆకాశ్ చోప్రా భారత మాజీ సారథి విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడని రాజ్యం లేని పాలకుడిగా అభివర్ణించాడు. కోహ్లితో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ సూపర్ కింగ్స్ పై కూడా చోప్రా స్పందించాడు.
ఐపీఎల్ మెగా వేలం దగ్గరపడుతున్న నేపథ్యంలో సారథులు లేని ఫ్రాంచైజీలు కెప్టెన్ తో పాటు ఇతర ఆటగాళ్ల గురించి లెక్కలేసుకుంటున్న తరుణంలో చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆర్సీబీ కెప్టెన్ ఆప్షన్లపై తన యూట్యూబ్ ఛానెల్ లో చోప్రా మాట్లాడుతూ.. ‘మీరు (ఆర్సీబీ) విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ లను రిటైన్ చేసుకున్నారు. వీరిలో ఎవరైనా కెప్టెన్ కాగలరా..? కోహ్లి గతంలో సారథిగా పని చేసి ఉండొచ్చు. కానీ అతడు మళ్లీ ఆ బాధ్యతలను తీసుకోడానికి సుముఖంగా లేడు. నిజానికి ఇప్పుడు అతడు రాజ్యం లేని పాలకుడు. ఇప్పుడు అతడు ఏ రాజ్యానికీ రాజు కాదు..’ అని వ్యాఖ్యానించాడు.
‘మ్యాక్స్వెల్ ను చేయాలనుకుంటే.. కొంచెం కష్టమే. గతేడాది ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు అతడి ప్రదర్శన భాగుంది. నిజానికి గతేడాది ఆ జట్టు విజయాల్లో అతడి పాత్ర ఎంతో ఉంది. కానీ అతడు కెప్టెన్ కాగలడా..? కఠినమైన ఎంపికే.. నేనైతే ఆ మార్గంలో వెళ్లను..
శ్రేయస్ అయ్యర్ ద్వారా ఒక ఆప్షన్ ఉంది. బెంగళూరు అతడి గురించి కూడా ఆలోచించవచ్చు. కానీ వ్యక్తిగతంగా అతడు నా నెంబర్ వన్ ఎంపిక కాదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అయ్యర్ టాపార్డర్ బ్యాటర్. మీరు అతడ్ని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు పంపితే ఏం ఉపయోగమూ లేదు. టాపార్డర్ లో కోహ్లి, మ్యాక్స్వెల్ ఉన్నందున అయ్యర్ కు ఆ అవకాశం ఉండకపోవచ్చు.
అయ్యర్ కాకుండా ఆ జట్టు జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ లను కూడా చూడొచ్చు. ఆర్సీబీ వంటి జట్టుకు హోల్డర్ సారథిగా పర్ఫెక్ట్ గా పనికొస్తాడని నా నమ్మకం.. ’ అని సూచించాడు.
ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ కు మయాంక్ అగర్వాల్ ను కెప్టెన్ చేస్తే ఉత్తమమని చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘పంజాబ్ మయాంక్ తో పాటు అర్షదీప్ సింగ్ ను రిటైన్ చేసుకుంది. కెఎల్ రాహుల్ ఆ జట్టు నుంచి వెళ్లడంతో పంజాబ్ కు కెప్టెన్ ను వెతుక్కునే పని పడింది. కానీ ఆ జట్టుకు తన ఖాతాలో రూ. 72 కోట్లున్నాయి. దాంతో వాళ్లకు కొత్త సారథిని నియమించుకోవడానికి సరైన వనరులు కూడా ఉన్నాయి.
అయితే మయాంక్ ను కెప్టెన్ గా చేస్తే మంచిదని నా భావన. ఎందుకంటే అతడు గత మూడేండ్లుగా రాహుల్ తో కలిసి ఆడాడు. ఇద్దరూ మంచి మిత్రులు. మూడు సీజన్లుగా ఇద్దరూ ఓపెనింగ్ చేశారు. రాహుల్ తో పోల్చితే మయాంక్ దూకుడుగా ఉంటాడు..’ అని చోప్రా తెలిపాడు.