ఇది మహిళలపై వివక్షే... పురుషుల క్రికెట్ జరుగుతున్నప్పుడు మహిళల క్రికెట్ వాయిదా ఎందుకు?
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ సీజన్కి ఏడు నెలల బ్రేక్ పడింది. ఐపీఎల్ 2020 తర్వాత దాదాపు అన్ని దేశాలు మళ్లీ క్రికెట్ ఆడడం మొదలెట్టాయి. కానీ షెడ్యూల్ ప్రకారం జనవరిలో భారత మహిళా జట్టుతో జరగాల్సిన వన్డే సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో మహిళా వివక్షపై మరోసారి చర్చను లేవనెత్తింది...
ఐపీఎల్ కంటే ముందే ఇంగ్లాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడింది ఆస్ట్రేలియా పురుషుల జట్టు...
కరోనాకు ఎదురొడ్డి ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులను విజయవంతంగా నిర్వహించగలిగింది కూడా...
ఐపీఎల్ తర్వాత ఓ వైపు ఆస్ట్రేలియాతో భారత పురుషుల జట్టు నెలన్నర క్రికెట్ ఆడుతూనే ఉంది... ఈ మ్యాచులకు ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు...
అదీకాకుండా మరోవైపు బీబీఎల్ (బిగ్బాష్ లీగ్ 2020-21) మ్యాచులు కూడా నడుస్తూనే ఉన్నాయి... వీటికి కూడా ప్రేక్షకులు హాజరవుతూ ఉన్నారు.
ఇలా పురుషుల క్రికెట్లో బిజీ షెడ్యూల్ నడుస్తున్నప్పుడు మహిళల క్రికెట్ నిర్వహించడానికే కరోనా అడ్డంకిగా మారిందా? అంటూ నిలదీస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు...
‘భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే, టీ20 సిరీస్ బాగానే ముగిసింది. టెస్టు సిరీస్ నడుస్తూనే ఉంది.. మరి భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ను మాత్రం వచ్చే సీజన్కి వాయిదా వేశారు...
ఇదెక్కడి న్యాయం? పురుషుల క్రికెట్కి అడ్డు కాని కరోనా, మహిళల క్రికెట్కి మాత్రం అడ్డంకిగా మారిందా? లింగ సమానత్వం అంటే ఇదేనా? ’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
కరోనా కారణంగా దాదాపు 10 నెలలుగా క్రికెట్కి దూరమయ్యారు మహిళా క్రికెటర్లు. టీ20 ఛాలెంజ్ పేరుతో మ్యాచులు నిర్వహించినా కేవలం అది నాలుగు మ్యాచుల ముచ్చటగానే మిగిలింది...
ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రన సంపాదించుకుంటున్న మహిళల క్రికెట్పై కరోనా తీవ్రంగా ప్రభావం చూపింది. మళ్లీ క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి...
వచ్చే సీజన్తో మూడు వన్డేల సిరీస్తో పాటు మూడు టీ20 మ్యాచుల సిరీస్ను కూడా జత చేస్తామని తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా...