- Home
- Sports
- Cricket
- మనీశ్ పాండేని ప్రమోట్ చేసినందుకు సిగ్గుపడ్డా! ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా... - గౌతమ్ గంభీర్
మనీశ్ పాండేని ప్రమోట్ చేసినందుకు సిగ్గుపడ్డా! ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా... - గౌతమ్ గంభీర్
ఐపీఎల్లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్లో కోల్కత్తా నైట్రైడర్స్ ఒకటి. షారుక్ ఖాన్ యజమాని కావడంతో బెంగాల్ జనాలే కాకుండా కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా కేకేఆర్కి సపోర్ట్ చేస్తారు. కేకేఆర్కి రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్..

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2008 సీజన్ ఆడిన కోల్కత్తా నైట్రైడర్స్, ఆ తర్వాత బ్రెండన్ మెక్కల్లమ్ని కూడా కెప్టెన్గా ప్రయత్నించింది. ఈ ఇద్దరూ కేకేఆర్ని ఫైనల్ కూడా చేర్చలేకపోయారు. అయితే గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది కోల్కత్తా నైట్రైడర్స్..
Image credit: Getty
ఆ తర్వాత 2014 సీజన్లో పంజాబ్ కింగ్స్ని ఓడించి, రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది కోల్కత్తా నైట్రైడర్స్. పంజాబ్ కింగ్స్, ఐపీఎల్ ఫైనల్ ఆడడం అదే తొలిసారి, ఆఖరి సారి కూడా.. గంభీర్ తర్వాత దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా... కేకేఆర్కి కెప్టెన్సీ చేసినా టైటిల్ అందించలేకపోయారు..
‘నేను ఎప్పుడూ ఏ మ్యాచ్ సమయంలోనూ ప్రెషర్ తీసుకోలేదు. అయితే ఐపీఎల్ 2014 సమయంలో కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యా. ఎందుకంటే 2014 సీజన్లో వరుసగా మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాను.. ఏం చేయాలో అర్థం కాలేదు.
ఆ తర్వాతి మ్యాచ్లో మనీశ్ పాండేని ఓపెనింగ్ చేయమని అడిగా. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. ఆ సీజన్లో మనీశ్ పాండే మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్లీ డకౌట్ అయిపోతానేమోనని భయపడి అలా చేశాను..
అయితే అలా చేసినందుకు ఇప్పటికీ సిగ్గు పడుతున్నా. ఓపెనర్గా వెళ్లిన మనీశ్ పాండే కూడా డకౌట్ అయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన నేను 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అప్పుడే మనీశ్ పాండే దగ్గరికి వెళ్లి సారీ చెప్పా! ఇంకెప్పుడూ అలా చేయనని మాటిచ్చాను...
ఆ పరిస్థితిని ధైర్యంగా ఫేస్ చేయాలని నిర్ణయించుకున్నా. క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేసినప్పుడు నిజమైన ప్లేయర్, లీడర్ బయటికి వస్తాడు. ఆ తర్వాతి మ్యాచ్లో నేను ఓపెనింగ్ చేసి, కేన్ రిచర్డ్సన్ బౌలింగ్లో మొదటి బంతికే ఫోర్ బాదాను..
నా ఐపీఎల్ కెరీర్లో అది అత్యంత ముఖ్యమైన ఫోర్. ఆ ఫోర్ తర్వాత నా మీద ఉన్న టన్నుల బరువు దించేసుకున్నట్టు అయ్యింది. మళ్లీ ఫ్రీగా బ్యాటింగ్ చేశాను.’ అంటూ చెప్పుకొచ్చాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్..
ఐపీఎల్ కెరీర్లో 4217 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, 2014 సీజన్లో నాలుగు మ్యాచుల్లో డకౌట్ అయినా 335 పరుగులు చేయగలిగాడు. ఫైనల్ మ్యాచ్లో సాహా 115 అజేయ సెంచరీతో పంజాబ్ కింగ్స్ 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మనీశ్ పాండే 94, యూసఫ్ పఠాన్ 36, గంభీర్ 23 పరుగులు చేయడంతో ఈ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది కేకేఆర్..