- Home
- Sports
- Cricket
- ప్రాక్టీస్ కోసమే అయితే ఆడిస్తే సరిపోద్దిగా.. ఇది ధావన్ను అవమానించడమే.. బీసీసీఐ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
ప్రాక్టీస్ కోసమే అయితే ఆడిస్తే సరిపోద్దిగా.. ఇది ధావన్ను అవమానించడమే.. బీసీసీఐ తీరుపై నెటిజన్ల ఆగ్రహం
India Tour Of Zimbabwe:టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు ముందు శిఖర్ ధావన్ ను సారథిగా ప్రకటించిన బీసీసీఐ తర్వాత అతడిని మార్చింది.

ఈనెల 18 నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు ముందుగా శిఖర్ ధావన్ ను సారథిగా నియమించింది బీసీసీఐ. కానీ తర్వాత అనూహ్యంగా సారథ్య బాధ్యతలను మార్చింది. ధావన్ ను కాదని గురువారం రాత్రి.. ఈ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని పేర్కొంది.
బీసీసీఐ చేసిన ఈ పనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ధావన్ ను అవమానించడమేనని ఆరోపిస్తున్నారు. రాహుల్ ను జింబాబ్వే టూర్ లో ఆడించాలనుకుంటే అతడిని ఓ బ్యాటర్ గా పంపిస్తే చాలని.. కెప్టెన్ చేయాల్సిన అవసరమేమొచ్చిందని ఫైర్ అవుతున్నారు.
ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్లు ఇదే విషయమై స్పందిస్తూ.. ‘మీరు (బీసీసీఐ) ముందు సీనియర్ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ధావన్ కు కెఎల్ రాహుల్ కంటే గొప్ప రికార్డు ఉంది. ఉన్నట్టుండి ధావన్ ను జింబాబ్వే టూర్ నుంచి తప్పించడం సరైన పద్దతి కాదు..
వన్డేలలో ధావన్ మంచి సారథి. బీసీసీఐ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చినా అతడికి కేవలం వన్డేలు ఆడే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఇలా అవమానిస్తున్నారు. కెఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే అతడు ముందు ఫామ్ నిరూపించుకోవాలి.
ఆసియా కప్ ముందు అతడికి ప్రాక్టీస్ గా ఈ సిరీస్ ను వాడుకోవాల్సి వస్తే కేవలం ఆటగాడిగా ఆడిస్తే సరిపోతుంది కదా.. కెప్టెన్ చేయడమెందుకు..?’ అని నిలదీస్తున్నారు.
మరికొందరు స్పందిస్తూ.. ‘2 నెలల తర్వాత భారత జట్టులోకి రాహుల్ తిరిగిరావడం సంతోషమే. కానీ ధావన్ ను తప్పించి మరీ రాహుల్ ను సారథిగా నియమించడం అవసవరమా..? ఇది ధావన్ ను అవమానించడం కాదా..?’ అని ప్రశ్నిస్తున్నారు.
బుధవారం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టు లో పాస్ అయిన రాహుల్.. జింబాబ్వే టూర్ లో భారత కెప్టెన్ ను మార్చింది బీసీసీఐ. ఆసియా కప్ కు ముందు రాహుల్ కు ప్రాక్టీస్ కూడా అవుతుందని భావించిన జట్టు యాజమాన్యం.. అతడిని జింబాబ్వేకు పంపనుంది. ఇప్పటికే ప్రకటించిన 15 మందితో పాటు రాహుల్ పేరును చేర్చి మొత్తం 16 మంది సభ్యులతో కూడిన జట్టును అప్డేట్ చేసింది.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మహమ్మద్ సిరాజ్