- Home
- Sports
- Cricket
- ఎండలు మండిపోతున్నై.. బీర్లు కాదు అవి ఎక్కువ తాగండి : దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు కెప్టెన్ సూచన
ఎండలు మండిపోతున్నై.. బీర్లు కాదు అవి ఎక్కువ తాగండి : దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు కెప్టెన్ సూచన
IND vs SA T20I: టీమిండియా-సౌతాఫ్రికా మధ్య గురువారం రాత్రి తొల టీ20 మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

భారత్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు ఉపఖండానికి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు ఎండలకు తాళలేకపోతున్నది. దక్షిణాదిలో వాతావరణం కాస్త చల్లబడ్డా ఉత్తరాదిలో మాత్రం భానుడు ఇంకా ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు.
ఢిల్లీలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 42-45 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. దీంతో ప్రాక్టీస్ సెషన్స్ కు వస్తున్న సఫారీ ఆటగాళ్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఇవేం ఎండల్రా బాబోయ్ అని వాళ్లు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా ఇదే విషయమై దక్షిణాఫ్రికా జట్టు సారథి టెంబ బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎండల నుంచి బాడీ డీహైడ్రేట్ అవకుండా ఉండటానికి గాను అతడు తమ జట్టు ఆటగాళ్లకు కీలక సూచనలిచ్చాడు.
బవుమా మాట్లాడుతూ.. ‘భారత్ లో ఈ టైంలో ఎండలు దంచికొడతాయని మేం అంచనా వేశాం. కానీ ఇంత వేడిని మాత్రం ఊహించలేదు. అయితే టీమిండియాతో మేం ఆడబోయే మ్యాచులు రాత్రి ఉండటం వల్ల మేం బతికిపోయాం.
ఇక రోజులో ప్రాక్టీస్ సెషన్ లో మేం ఎండ వేడిమికి తాళలేకపోతున్నాం. మా ఆటగాళ్లు డీహైడ్రేట్ అవకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని వారికి సూచిస్తున్నా.
ఇంట్లో (దక్షిణాఫ్రికాలో) అయితే వాళ్లు సాధారణంగా బీర్లు తాగుతారు. కానీ ఇక్కడ బీర్ కాదు.. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే నీళ్లు ఎక్కువ తాగాలి. అదే మా ఆటగాళ్లకు చెబుతున్నా. అలా అయితే ఫిజికల్ గానే గాక మెంటల్ గా కూడా రిఫ్రెష్ అవుతాం...’ అని తెలిపాడు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల దాకా ఉండొచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే నాటికి అది కాస్త తగ్గినా వడగాలులు, ఉక్కపోత మాత్రం తగ్గదు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గకపోవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.