‘ఆ క్యాచ్ పట్టి ఉండాల్సింది.. ఏమో మరి.. వాళ్లు అలా ఎందుకు చేశారో నాకైతే తెలియదు’
INDvsBAN ODI: ఇండియా - బంగ్లాదేశ్ మధ్య ఆదివారం ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు విజయానికి అత్యంత చేరువగా వచ్చినా ఒక్క వికెట్ తీయలేక చతికిలపడి ఓటమిని మూటగట్టుకుంది.

బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో దాదాపు గెలిచినంత పనిచేసిన టీమిండియా.. ఒక్క వికెట్ తీయలేక పరువు తీసుకుంది. చివరి వరుస బ్యాటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తో కలిసి మెహిది హసన్ మిరాజ్ అద్భుతంగా పోరాడి బంగ్లాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అయితే ఈ మ్యాచ్ లో మెహిది హసన్ ఇచ్చిన క్యాచ్ ను కెఎల్ రాహుల్ మిస్ చేశాడు. అంతేగాక తర్వాత బంతికే వాషింగ్టన్ సుందర్ కూడా తన దగ్గర పడ్డ బంతిని క్యాచ్ అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఈ ఇద్దరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఇదే విషయమై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత క్రిక్ బజ్ లో క్రీడా విశ్లేషకుడిగా మారిన కార్తీక్.. రాహుల్, వాషింగ్టన్ ల క్యాచ్ మిస్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ సంగతి పక్కనబెడితే వాషింగ్టన్ మాత్రం అది అటెంప్ట్ చేసి ఉండాల్సిందని అన్నాడు.
కార్తీక్ మాట్లాడుతూ.. ‘అవును. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి కెఎల్ రాహుల్ డ్రాప్ క్యాచ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ను మిస్ చేయడం కూడా ప్రధాన కారణాలే. అయితే వాళ్లిద్దరూ ఎందుకు అలా చేశారో నాకైతే తెలియదు. మ్యాచ్ లో చివరికి వచ్చేసరికి లైటింగ్ లేకపోవడంతో ఫ్లడ్ లైట్లు ఆన్ చేశారు. బహుశా రాహుల్ క్యాచ్ మిస్ కావడానికి అదీ ఓ కారణం కావచ్చు.
వాస్తవానికి రాహుల్ క్యాచ్ చాలా కష్టమైనదే. కానీ అతడు ట్రై చేశాడు. కానీ వాషింగ్టన్ మాత్రం క్యాచ్ పట్టడానికి ట్రై చేయాల్సింది. కానీ అతడు ఎందుకు అలా చేయలేదో నాకు తెలియదు. ఈ ప్రశ్నకు అతడే సమాధానమివ్వగలడు. ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ కూడా ఏమీ బాగోలేదు. ఒత్తిడి కారణంగా మన ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద కొన్ని తప్పిదాల కారణంగా అనవసర పరుగులు సమర్పించుకున్నారు..’అని అన్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 136కే 9 వికెట్లు కోల్పోయినా ముస్తాఫిజుర్ రెహ్మాన్ తో కలిసి మెహిది హసన్ మిరాజ్ అద్భుతం చేశాడు. చివరి వికెట్ కు 51 పరుగులు జోడించి బంగ్లాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 9 వికెట్లు తీసిన భారత బౌలర్లకు అడ్డునిలిచి చివరి వరకు నిలబడి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు.